ఢిల్లీలో భారీ వర్షాలు..11కు చేరిన మృతుల సంఖ్య

by Vinod |
ఢిల్లీలో భారీ వర్షాలు..11కు చేరిన మృతుల సంఖ్య
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. వీధుల్లో, రోడ్ల మీద నీరు నిలిచింది. శనివారం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం వల్ల వేర్వేరు ఘటనల్లో ఒక వృద్ధుడు, ఓ యువకుడు, నలుగురు పిల్లలు మరణించారు. దీంతో రెండు రోజులుగా కురిసిన వానలతో ఢిల్లీలో మరణించిన వారి సంఖ్య 11కు చేరుకుంది. అంతకుముందు రోజు 5గురు మరణించారు. అయితే బాలురు స్నానం చేస్తుండగా నీట మునిగి మరణించినట్టు అధికారులు తెలిపారు. వర్షాలు మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. పలు చోట్ల చెట్లు విరిగిపడటంతో విద్యుత్ సరఫరాకు సైతం తీవ్రం అంతరాయం కలిగినట్టు తెలుస్తోంది.

జలమయమైన ఎయిమ్స్

ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) బేస్‌మెంట్ ప్రాంతం శనివారం కూడా వరదలతో నిండిపోయింది. దీంతో ఆపరేషన్ థియేటర్ లో కార్యకలాపాలు ఇంకా ప్రారంభించలేదని ఎయిమ్స్ అధికారి రిమా దాదా తెలిపారు. అయితే నాలుగు సీరియస్ కేసులకు మాత్రం అత్యవసరంగా ఆపరేషన్ చేసినట్టు వెల్లడించారు. బేస్‌మెంట్‌లో నీరు నిలిచిందని, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కాగా, జూన్ 27న 364, 28న 347 మందికి శస్త్రచికిత్సలు జరిగాయి.

Next Story

Most Viewed