Rahul Gandhi : మీడియా నియంత్రణకు కేంద్రం ఏకపక్ష చట్టాలు.. రాహుల్‌కు ఎడిటర్స్ గిల్డ్ లేఖ

by Hajipasha |
Rahul Gandhi : మీడియా నియంత్రణకు కేంద్రం ఏకపక్ష చట్టాలు.. రాహుల్‌కు ఎడిటర్స్ గిల్డ్ లేఖ
X

దిశ, నేషనల్ బ్యూరో : పత్రికా స్వేచ్ఛ, సమాచార హక్కు చట్టంతో ముడిపడిన సమస్యలను పార్లమెంటులో లేవనెత్తడంలో తమకు సహకరించాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ విపక్షనేత రాహుల్ గాంధీని ‘ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా’ కోరింది. గత కొన్నేళ్లలో ప్రింట్, బ్రాడ్ కాస్ట్, డిజిటల్ మీడియా సంస్థల కార్యకలాపాల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా చట్టాలు తీసుకొచ్చిందని, వాటిపై పునస్సమీక్ష జరగాలని డిమాండ్ చేసింది. ఈఅంశంలో తమకు మద్దతుగా నిలవాలని కోరుతూ రాహుల్ గాంధీకి ‘ఎడిటర్స్ గిల్డ్’ శనివారం లేఖ రాసింది.

ఎన్డీయే సర్కారు తీసుకొచ్చిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, బ్రాడ్‌కాస్ట్ సర్వీసెస్ రెగ్యులేషన్ బిల్లు, ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్ యాక్ట్‌‌లలోని పలు నిబంధనలపై ‘ఎడిటర్స్ గిల్డ్’ ఆందోళన వ్యక్తం చేసింది. ఐటీ రూల్స్ 2021 చట్టంలో 2023లో చేసిన సవరణలపైనా అభ్యంతరం వ్యక్తపరిచింది. ‘‘ప్రజాస్వామ్య వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే స్వేచ్ఛాయుత మీడియా ఉండాలి. దీని పరిరక్షణకుగానూ ఆయా చట్టాల పునస్సమీక్ష అత్యవసరం" అని గిల్డ్ తెలిపింది.



Next Story