Delhi Police : పెదనాన్న అప్పున్నాడని.. బాలికను కిడ్నాప్ చేయించిన మేనమామ

by Hajipasha |
Delhi Police : పెదనాన్న అప్పున్నాడని.. బాలికను కిడ్నాప్ చేయించిన మేనమామ
X

దిశ, నేషనల్ బ్యూరో : ఓ మైనర్ బాలికను ఐదుగురు వ్యక్తులు ఢిల్లీలో కిడ్నాప్ చేసి, నేపాల్‌కు తీసుకెళ్లేందుకు యత్నించారు. అయితే ఢిల్లీ పోలీసులు వేగంగా స్పందించి ఇండో-నేపాల్ బార్డర్‌లో వారిని అరెస్టు చేసి ఆటకట్టించారు. వివరాల్లోకి వెళితే.. బాలిక కిడ్నాప్ ఘటన ఢిల్లీలోని ఐపీ ఎస్టేట్ ఏరియా పరిధిలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కిరాణా దుకాణానికి సదరు బాలిక వెళ్తుండగా.. మార్గం మధ్యలో ఓ మహిళ చాక్లెట్లు ఇస్తానంటూ ఆమెను కిడ్నాప్ చేసింది. ఐదుగురు వ్యక్తులు కలిసి కారులో ఆ బాలికను బిహార్‌కు తీసుకెళ్లారు. అనంతరం డబ్బులను డిమాండ్ చేస్తూ కిడ్నాపర్ల నుంచి బాలిక తండ్రి వాట్సాప్ నంబరుకు వాయిస్ మెసేజ్‌లు వచ్చాయి. దీనిపై బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ నంబరును ట్రాక్ చేయగా అది మలేషియా నంబరు అని వెల్లడైంది. లొకేషన్ కోసం వెతకగా బిహార్‌లోని సీతామర్హి ప్రాంతాన్ని చూపించింది.

దీంతో సదరు బాలిక కుటుంబ సభ్యులతో మాట్లాడిన పోలీసులు.. సీతామర్హిలో ఎవరైనా బంధువులు, సన్నిహితులు ఉన్నారా అని ఆరాతీశారు. అయితే ఒక బంధువు అక్కడే ఉంటారని వెల్లడైంది. దీంతో ఢిల్లీ పోలీసులు హుటాహుటిన సీతామర్హికి చేరుకున్నారు. అయితే అప్పటికే కిడ్నాపర్లు సదరు బాలికను తీసుకొని నేపాల్ వైపు బయలుదేరారు. వారిని వెంబడించిన పోలీసులు ఇండో-నేపాల్ బార్డర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ఇంటరాగేషన్‌లో నిందితులు కీలక విషయాన్ని తెలిపారు. ఆ బాలిక పెదనాన్న.. ఆమె మేనమామకు అప్పు బకాయిలు ఇవ్వాల్సి ఉందన్నారు. ఆ అప్పు బకాయిల కోసమే బాలిక మేనమామ తమతో ఈ కిడ్నాప్ చేయించాడని నిందితులు వెల్లడించారు. నేపాల్‌లో ఉంటున్న మేనమామ దగ్గరికి ఆ బాలికను తాము తీసుకెళ్తుండగా దొరికిపోయినట్లు ఒప్పుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed