Delhi: 128 రోజుల పాటు స్వచ్ఛమైన గాలిని పీల్చిన ఢిల్లీ ప్రజలు

by Shamantha N |
Delhi: 128 రోజుల పాటు స్వచ్ఛమైన గాలిని పీల్చిన ఢిల్లీ ప్రజలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈ ఏడాది ప్రథమార్థంలో ఢిల్లీ ప్రజలు 128 రోజుల పాటు స్వచ్ఛమైన గాలిని పీల్చారని ఆప్ ప్రభుత్వ నివేదిక పేర్కొంది. ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (DPCC) సమర్పించిన నివేదిక ఈ ఏడాది జనవరి నుండి జూలై వరకు ఉన్న వాయు కాలుష్యాన్ని ట్రాక్ చేసింది. డీపీసీసీ నివేదిక ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు 128 రోజులపాటు గాలి నాణ్యత స్వచ్ఛంగా ఉందని వెల్లడించింది. ఆగస్టు 1 నుంచి ఆగస్టు 20 వరకు 20 రోజులపాటు గాలి నాణ్యత స్వచ్ఛంగా ఉన్నట్లు పేర్కొంది. గాలి నాణ్యత సంతృప్తికరంగా 159 రోజులు ఉండగా.. 2023లో ఆ సంఖ్య206కి పెరిగింది.

వాయుకాలుష్యానికి ప్రధాన కారణాలివే..

అంతేకాకుండా, ఢిల్లీలోని వాహనాలు, పారిశ్రామిక ఉద్గారాలు, బహిరంగంగా దహనం చేయడం వాయుకాలుష్యానికి ప్రధాన కారణాలుగా నివేదిక గుర్తించింది. వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యలను కూడా హైలైట్ చేసింది. వాహనాల కాలుష్యాన్ని అరికట్టేందుకు రవాణా శాఖ, ట్రాఫిక్‌ పోలీసులతో కలిపి మొత్తం 385 ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు జనవరి 1 నుండి జూలై 15 మధ్య 308 వాహనాలను సీజ్ చేశారు. త్వరలో ఢిల్లీ ప్రభుత్వం 3,267 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని యోచిస్తోందని నివేదిక పేర్కొంది. అక్టోబర్ 2023 నుండి జూలై 2024 వరకు బయోమాస్‌ను బహిరంగంగా కాల్చకుండా నిరోధించడానికి మొత్తం 338 పెట్రోలింగ్ బృందాలను నియమించారు. కాగా.. ఈ బృందాలు 65 వేల చోట్ల తనిఖీలను నిర్వహించి దాదాపు 550 చలాన్లు జారీ చేసి.. రూ.6.85 లక్షల జరిమానా విధించినట్లు నివేదిక పేర్కొంది.

Advertisement

Next Story