స్టైల్‌గా రెడీ అయి కూలింగ్‌ గ్లాసెస్‌ పెట్టుకున్నాడని దళిత వ్యక్తిపై దాడి

by Harish |
స్టైల్‌గా రెడీ అయి కూలింగ్‌ గ్లాసెస్‌ పెట్టుకున్నాడని దళిత వ్యక్తిపై దాడి
X

అహ్మదాబాద్‌: గుజ‌రాత్‌లో ఒక అమానుష ఘటన చోటుచేసుకుంది. మంచి దుస్తులు ధరించి ముస్తాబై.. కూలింగ్‌ గ్లాసెస్‌ పెట్టుకున్న ఓ దళిత వ్యక్తిని చూసి ఓర్వలేకపోయిన ఏడుగురు వ్యక్తులు దాడికి తెగబడ్డారు. గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా పాలన్ పూర్ తాలూకాలోని మోటా గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. దాడికి గురైన బాధితుడు, అతడి తల్లి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుడు జిగర్ షెఖలియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన‌ట్టు పోలీసులు చెప్పారు.

"మంగళవారం ఉదయం నేను మా ఇంటి బయట నిలబడి ఉండగా ఆ ఏడుగురు నిందితుల్లో ఒకడు నా దగ్గరకు వచ్చాడు. చాలా ఎత్తుకు ఎదుగుతున్నావ్ అని నన్ను కామెంట్ చేశాడు. ఒక స్థాయిలో ఉండకపోతే నన్ను చంపుతానని బెదిరించాడు" అని ఫిర్యాదులో బాధితుడు వివరించాడు.

మంగళవారం రోజు రాత్రి ఊరిలోని ఆలయం వెలుపల బాధితుడు జిగర్ షెఖలియా నిల్చుని ఉండగా.. నిందితుల్లో ఆరుగురు కర్రలు పట్టుకుని అతడి దగ్గరికి వచ్చారు. సన్ గ్లాసెస్ ఎందుకు పెట్టుకున్నావంటూ చితకబాదారు. ఈ క్రమంలో కాపాడేందుకు జిగర్ షెఖలియా తల్లి పరుగెత్తడంతో ఆమెపైనా దాడి చేసి చంపేస్తామని బెదిరించారు.

ఆ నిందితులు తన తల్లి దుస్తులను కూడా చింపేశారని బాధితుడు జిగర్ షెఖలియా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. నిందితుల‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసు అధికారి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed