కాంగ్రెస్ త్వరలో ప్రియాంక, రాహుల్ వర్గాలుగా చీలిపోవచ్చు: ఆ పార్టీ బహిష్కృత నేత

by Disha Web Desk 17 |
కాంగ్రెస్ త్వరలో ప్రియాంక, రాహుల్ వర్గాలుగా చీలిపోవచ్చు: ఆ పార్టీ బహిష్కృత నేత
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్‌ పార్టీ త్వరలో రాహుల్‌గాంధీ వర్గంగా, ప్రియాంకగాంధీ వర్గంగా చీలిపోవచ్చని కాంగ్రెస్‌ మాజీ నేత ఆచార్య ప్రమోద్‌ కృష్ణం సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ప్రముఖ మీడియాతో మాట్లాడిన ఆయన రాహుల్ గాంధీ అమేథీని వీడటంతో పార్టీ కార్యకర్తల మనోధైర్యం తగ్గిపోయిందని అన్నారు. రాహుల్‌కు పాక్‌లో ఆదరణ ఉన్నందున రాయ్‌బరేలీకి బదులుగా రావల్పిండి నుండి పోటీ చేయాలని భావిస్తున్నట్లు ఆచార్య ప్రమోద్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు, కానీ ఆమె పోటీ చేయకపోవడంతో ఆమె మద్దతుదారుల గుండెల్లో అగ్నిపర్వతం రగులుతుంది. అది జూన్ 4 తరువాత పేలుతుందని ఆయన అన్నారు.

ప్రియాంకపై పెద్ద కుట్ర జరుగుతోందని, ఆమె కుటుంబం, పార్టీ పన్నిన కుట్రకు ఆమె బాధితురాలు అని గతంలో అన్న మాటాలను ఆచార్య ప్రమోద్‌ గుర్తు చేసుకుంటూ, రాహుల్ అమేథీలో పోటీ చేయరని నేను ముందే చెప్పాను. ఈ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ వాద్రాను రాహుల్ గాంధీ పోటీ చేయనివ్వరని కూడా చెప్పాను. ఆమెపై కుట్ర జరుగుతుందని అన్నారు. రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేయకూడదనుకుంటే ప్రధాని నరేంద్ర మోడీపై వారణాసి నుంచి పోటీ చేసి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. క్రమశిక్షణా చర్యల క్రింద ఆచార్య ప్రమోద్ కృష్ణంను ఫిబ్రవరి 2024లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి బహిష్కరించారు.

Next Story

Most Viewed