జార్ఖండ్‌లో లవ్ జిహాద్‌కి సీఎం మద్దతు..కేంద్ర హోం మంత్రి అమిత్ షా

by vinod kumar |
జార్ఖండ్‌లో లవ్ జిహాద్‌కి సీఎం మద్దతు..కేంద్ర హోం మంత్రి అమిత్ షా
X

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ల్యాండ్ జిహాద్’ ‘లవ్ జిహాద్’కు సీఎం మద్దతిస్తున్నారని ఆరోపించారు. దీని కారణంగానే రాష్ట్రంలో జనాభా మార్పులు జరుగుతున్నాయని విమర్శించారు. జార్ఖండ్‌లో అక్రమంగా వలస వచ్చినవారు గిరిజన మహిళలను పెళ్లి చేసుకోవడం, భూములు కొనుగోలు చేయడం వల్ల భవిష్యత్తులో గిరిజన జనాభా తగ్గుతుందని తెలిపారు. జార్ఖండ్‌లో పర్యటించిన అమిత్ షా రాంచీలోని ప్రభాత్ తారా గ్రౌండ్‌లో శనివారం బీజేపీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ప్రసంగించారు. గిరిజన సామాజిక వర్గ నేపథ్యమున్న సీఎం ఆ ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు.

దేశంలో ఎక్కడైనా గిరిజనుల జనాభా తగ్గిపోతుంటే అది జార్ఖండ్‌లో మాత్రమేనని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు బీజేపీకి ఓటేస్తే వారి భూమి, జనాభా, రిజర్వేషన్లు పొందేందుకు శ్వేతపత్రం తీసుకు వస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోకి అక్రమ వలసదారులు ప్రవేశిస్తున్న తీరు నేరుగా యువత ఉపాధిపై ప్రభావం చూపుతోందన్నారు. వీటిని వెంటనే అరికడతామని తేల్చి చెప్పారు. సమస్యలన్నింటికీ పక్కన పెట్టి హేమంత్ సొరేన్ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల గురించి మాత్రమే ఆందోళన చెందుతున్నారని తెలిపారు. రాష్ట్ర తొలి గిరిజన ముఖ్యమంత్రిగా బాబు లాల్‌ను నియమించింది బీజేపీయేనని గుర్తు చేశారు. భారత రాష్ట్రపతిగా గిరిజన మహిళను నియమించామని, రైల్వే స్టేషన్‌లో సంతాలీ భాషలో ప్రకటనలు జరిగేలా చేసింది బీజేపీ ప్రభుత్వమేనని కొనియాడారు.



Next Story