CBI : ఎన్‌టీఏ ట్రంకు నుంచి ‘నీట్’ పేపర్ దొంగిలించిన 'మాస్టర్ మైండ్' అరెస్ట్

by Hajipasha |
CBI : ఎన్‌టీఏ ట్రంకు నుంచి ‘నీట్’ పేపర్ దొంగిలించిన మాస్టర్ మైండ్ అరెస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో : నీట్-యూజీ పేపర్ లీక్ కేసులో మరో ప్రధాన సూత్రధారిని శనివారం సీబీఐ అరెస్టు చేసింది. లీకైన ప్రశ్నాపత్రాలకు సమాధానాలు రాసిచ్చిన ఇద్దరు ఎంబీబీఎస్ విద్యార్థులను కూడా సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఈ ఇద్దరిని రాజస్థాన్‌లోని భరత్‌పూర్ మెడికల్ కాలేజీ రెండో సంవత్సరం విద్యార్థి కుమార్ మంగళం బిష్ణోయ్, మొదటి సంవత్సరం విద్యార్థి దీపేందర్ కుమార్‌ శర్మలుగా గుర్తించారు.సీబీఐ కథనం ప్రకారం.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జంషెడ్‌పూర్‌కు చెందిన 2017-బ్యాచ్ సివిల్ ఇంజనీర్ పంకజ్ కుమార్ అలియాస్ ఆదిత్య జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ట్రంక్ నుంచి నీట్ ప్రశ్నాపత్రాన్ని దొంగిలించాడు. ఆ ప్రశ్నాపత్రానికి సమాధానాలు రాయడానికి కుమార్ మంగళం బిష్ణోయ్, దీపేందర్ కుమార్‌ శర్మలు రాజస్థాన్ నుంచి జార్ఖండ్‌లోని హజారీబాగ్‌కు వెళ్లారు. వాళ్లిద్దరూ కలిసి అక్కడ ప్రశ్నాపత్రానికి సమాధానాలను సిద్ధం చేసి ఇచ్చారు.

టెక్నికల్ సర్వైలెన్స్ సమాచారం ఆధారంగా వారి కదలికలపై పక్కా వివరాలను సీబీఐ అధికారులు సేకరించారు. పేపర్ లీక్ వ్యవహారంలో నిట్ జంషెడ్‌పూర్‌లోనే బీటెక్ ఎలక్ట్రికల్ కోర్సు చదివిన శశికాంత్ పాస్వాన్, పంకజ్ కుమార్, జార్ఖండ్‌లోని రాంచీలో రెస్టారెంట్ నడిపే రాకీ కలిసి పనిచేసినట్లు దర్యాప్తులో తేలింది. తాజాగా పంకజ్ కుమార్‌ను సీబీఐ అరెస్టు చేయగా.. మిగతా వారిని నెల క్రితమే అదుపులోకి తీసుకున్నారు. ఇక శుక్రవారం రోజు రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సురభి కుమారిని అరెస్టు చేశారు. నీట్ యూజీ ప్రశ్నాపత్రానికి సమాధానాలు రాయడంలో ఆమె సహకరించినట్లు గుర్తించారు.



Next Story