బెంగాల్ లో ముదురుతున్న సీఎం, గవర్నర్ ఫైట్.. మమతాపై పరువునష్టం కేసు..?

by Shamantha N |
బెంగాల్ లో ముదురుతున్న సీఎం, గవర్నర్ ఫైట్.. మమతాపై పరువునష్టం కేసు..?
X

దిశ, నేషనల్ బ్యూరో: ప‌శ్చిమ బెంగాల్ లో సీఎం, గవర్నర్ ఫైట్ రోజురోజుకూ ముదిరిపోతోంది. బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీపై ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ సీవీ ఆనంద్ బోస్ ప‌రువునష్టం కేసు న‌మోదు చేశారు. కోల్‌క‌తా హైకోర్టులో ఆయ‌న పిటిష‌న్ దాఖలు చేశారు. రాజ్‌భ‌వ‌న్‌లోని కార్యలాపాలు చూసి మహిళలు అక్కడికి వెళ్లేందుకు భ‌య‌ప‌డుతున్నార‌ని ఇటీవలే దీదీ కామెంట్లు చేశారు. ఆ ఆరోప‌ణ‌ల‌ను ఖండిస్తూ గ‌వ‌ర్న‌ర్ ఆనంద్ బోస్ ప‌రువున‌ష్టం కేసు దాఖ‌లు చేశారు. మమతాతో సహా రాజ్ భవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీఎంసీ నాయకులపై పరువునష్టం కేసు వేశారు. ప్ర‌జాప్ర‌తినిధులు త‌ప్పుడు, అపవాదు వచ్చే వార్తలను సృష్టించరాదని అన్నారు.

వివిధ పార్టీల స్పందన ఇదే..

రాజ్‌భ‌వ‌న్‌లో గ‌వ‌ర్న‌ర్ ఆనంద బోస్.. వేధింపుల‌కు పాల్ప‌డిన‌ట్లు కాంట్రాక్టు మ‌హిళా ఉద్యోగి ఒక‌రు మే 2న ఫిర్యాదు చేశారు. ఆ కేసులో కోల్‌క‌తా పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఈ అంశంపై స్పందించేందుకు టీఎంసీ రాజ్య‌స‌భ ఎంపీ డోలా సేన్ నిరాకరించారు. ఇదో సున్నితమైన అంశం అని.. అస‌లు ఏం జ‌రిగింద‌నే దానిపై పార్టీ హైకమాండ్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. గవర్నర్ ఆనంద బోస్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్లు బీజేపీ సీనియర్ లీడర్ రాహుల్ సిన్హా ప్రకటించారు. ఇది ఎప్పుడో తీసుకోవాల్సిన నిర్ణయం అని అన్నారు. మరోవైపు, సీఎం, గవర్నర్ మధ్య వైరం వల్ల రాష్ట్రానికి ఎలాంటి మేలు జరగట్లేదని సీపీఎం నేత సుజన్ చక్రవర్తి మండిపడ్డారు.



Next Story