Asia Cup 2023: పాక్‌‌‌లో రోజర్ బిన్నీ, రాజీవ్ శుక్లా పర్యటన..

by Vinod kumar |
Asia Cup 2023: పాక్‌‌‌లో రోజర్ బిన్నీ, రాజీవ్ శుక్లా పర్యటన..
X

అమృత్‌సర్: ఆసియా కప్ మ్యాచ్‌లను వీక్షించేందుకు బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా సోమవారం పాకిస్తాన్‌కు వెళ్లారు. పంజాబ్‌లోని అటారీ-వాఘా సరిహద్దును దాటి పాక్‌లో అడుగుపెట్టారు. అంతకుముందు అమృత్‌సర్‌లోని ఎయిర్‌పోర్టులో వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ.. క్రికెట్ కోసమే తాము పాక్‌లో పర్యటిస్తున్నట్టు తెలిపారు. ‘ఈ పర్యటనలో రాజకీయం లేదు. పాక్‌లో రెండు రోజుల పర్యటన క్రికెట్ సంబంధితమైనదే.’ అని చెప్పారు. అలాగే, పాకిస్తాన్‌లో టీమ్ ఇండియా పర్యటించకపోవడంపై స్పందిస్తూ.. ప్రభుత్వం సూచనల మేరకు తాము నడుచుకుంటామని, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే అదే పాటిస్తామని తెలిపారు.

పాకిస్తాన్‌కు వెళ్లిన రోజర్ బిన్నీ, రాజీవ్ శుక్లాలకు పీసీబీ ప్రెసిడెంట్ అష్రఫ్‌తోపాటు ఇతర బోర్డు ప్రతినిధులు స్వాగతం పలికారు. కాగా, ఆసియా కప్‌కు పాకిస్తాన్ ఆతిథ్య దేశంగా ఉన్న విషయం తెలిసిందే. పీసీబీ ఆహ్వానం మేరకు బీసీసీఐ నుంచి అధ్యక్షుడు రోజర్ బిన్నీ, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా పాక్‌కు వెళ్లారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు రద్దయినప్పటి నుంచి బీసీసీఐ ప్రెసిడెంట్ పాక్‌లో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. నేడు లాహోర్ వేదికగా జరిగే ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక మ్యాచ్‌కు రోజర్ బిన్నీ, రాజీవ్ శుక్లా హాజరుకానున్నారు.

Advertisement

Next Story