Sheikh Hasina: రఫేల్‌ తోడుగా.. నిరంతర పర్యవేక్షణలో ఇండియాలో దిగిన షేక్ హసీనా విమానం

by Harish |
Sheikh Hasina: రఫేల్‌ తోడుగా.. నిరంతర పర్యవేక్షణలో ఇండియాలో దిగిన షేక్ హసీనా విమానం
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల మధ్య ప్రధాని షేక్‌ హసీనా రాజీనామా చేసి ఇండియాకు వచ్చారు. ఆ దేశ వైమానిక దళానికి చెందిన విమానంలో హసీనా భారత్‌లోకి వస్తున్నట్లు ముందుగా సమాచారం అందుకున్న భారత భద్రతా దళాలు గగనతలంపై నిఘా వేశాయి. అటువైపు నుంచి వచ్చే విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీనికి రక్షణగా పశ్చిమ బెంగాల్‌లోని హాసీమారా వైమానిక స్థావరం నుంచి రఫేల్‌ యుద్ధ విమానాలు తోడుగా వచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లోని హిండన్ ఎయిర్‌బేస్‌లో విమానం దిగే వరకు కూడా భారత అధికారులు ఎప్పటికప్పుడు దానిలో ఉన్న సిబ్బందితో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, ఆ వివరాలను భారత వాయుసేనాధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌధరి, పదాతిదళాధిపతి జనరల్‌ ఉపేంద్ర ద్వివేదికి అందిస్తూ ఉన్నారు.

బంగ్లాదేశ్‌లో పరిస్థితులు క్షీణించిన నేపథ్యంలో భారత అధికారులు హసీనా విమానంపై గోప్యత పాటించారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 5:45 గంటలకు ఆమె ప్రయాణిస్తున్న విమానం దిగింది. అప్పటికే అక్కడికి చేరుకున్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డొభాల్ ఆమెకు సాధారంగా ఆహ్వానం పలికారు. కాసేపు వారిద్దరు అక్కడే బంగ్లాదేశ్‌‌లో ఉన్న పరిస్థితులపై చర్చలు జరిపారు. ప్రస్తుతం హసీనా భారత ప్రభుత్వ రక్షణలో ఉన్నారు. ఆమె మరికొద్ది రోజులు ఇక్కడే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed