Haryana Polls : 67 మందితో బీజేపీ తొలి జాబితా.. సీఎం సైనీకి లాద్వా టికెట్

by Hajipasha |
Haryana Polls : 67 మందితో బీజేపీ తొలి జాబితా.. సీఎం సైనీకి లాద్వా టికెట్
X

దిశ, నేషనల్ బ్యూరో : హర్యానా అసెంబ్లీ ఎన్నికల కోసం 67 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాను బీజేపీ బుధవారం విడుదల చేసింది. ఈ జాబితాలో సీఎం నయాబ్ సింగ్ సైనీ పేరు కూడా ఉంది. ఆయనకు లాద్వా అసెంబ్లీ టికెట్‌ను కేటాయించారు. మనోహర్‌లాల్ ఖట్టర్ సీఎంగా ఉన్న టైంలో కురుక్షేత్ర ఎంపీగా నయాబ్ సింగ్ సైనీ ఉండేవారు. అయితే ఈ ఏడాది మార్చిలోనే ఆయనకు సీఎంగా బీజేపీ హైకమాండ్ అవకాశాన్ని కల్పించింది. తదుపరిగా జూన్ నెలలో కర్నాల్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో నయాబ్ సింగ్ సైనీ గెలిచారు. ఇప్పుడు ఆయనకు లాద్వా టికెట్‌ను కేటాయించడం గమనార్హం.

మాజీ మంత్రి అనిల్ విజ్‌కు అంబాలా కంటోన్మెంట్ స్థానం నుంచి మరోసారి అవకాశాన్ని కల్పించారు. 2009 నుంచి వరుసగా మూడుసార్లు అక్కడి నుంచి ఆయన గెలిచారు. పంచకుల స్థానం నుంచి అసెంబ్లీ స్పీకర్ గియాన్ చంద్ గుప్తాను బరిలోకి దింపారు. కులదీప్ బిష్ణోయి కుమారుడు భవ్య బిష్ణోయికి ఆదంపూర్, కేంద్ర మంత్రి రావు ఇందర్జిత్ సింగ్ కుమార్తె ఆర్తి సింగ్‌కు అటేలీ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు. కాగా, హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed