ఒక భక్తుడిగా తల్లడిల్లిపోయాను.. లడ్డూ వివాదంపై సీనియర్ హీరో

by sudharani |
ఒక భక్తుడిగా తల్లడిల్లిపోయాను.. లడ్డూ వివాదంపై సీనియర్ హీరో
X

దిశ, సినిమా: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల లడ్డూ వివాదం పెద్ద చర్చనీయాంశంగా మారింది. తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులకు ఇచ్చే లడ్డూ ప్రసాదాన్ని కల్తీ నెయ్యితో తయారు చేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై రాజకీయ నాయకులతో పాటు, సినీ ఇండస్ట్రీకి చెందిన వారు కూడా ఒక్కొక్కరుగా రియాక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మంచు మోహన్ బాబు దీనిపై స్పందించారు. ఈ మేరకు ‘ప్రపంచ వ్యాప్తంగా ప్రతి హిందూ పూజించే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి. ఆ దైవానికి నిత్యం సమర్పించే లడ్డూలలో కలిపే ఆవు నెయ్యిలో దాదాపు 3 నెలల క్రితం వరకు ఇతర జంతువుల కొవ్వుని కలుపుతున్నారని తెలియగానే ఒక భక్తుడిగా తల్లడిల్లిపోయాను, తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను.

నిత్యం మా మోహన్ బాబు విశ్వవిద్యాలయం నుంచి కన్పించే తిరుమల క్షేత్రాన్ని చూసి నాతోపాటు వేలాదిమంది ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, నిత్యం భక్తిపూర్వకంగా నమస్కరించుకుంటూ ఉంటాం. ఆ స్వామి దగ్గర ఇలా జరగడం ఘోరం, పాపం, ఘోరాతి ఘోరం, నికృష్టం, అతినీచం, హేయం, అరాచకం. ఇదేగాని నిజమైతే నేరస్థులను శిక్షించాలని నా ఆత్మీయుడు, నా మిత్రుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుని హృదయపూర్వకంగా కోరుకుంటూ... ఈ కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు నా మిత్రుడు అందుకుని నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు.

Next Story

Most Viewed