ఐటీ ఎగుమతులు రెట్టింపయ్యాయి : కేటీఆర్

by Sridhar Babu |
ఐటీ ఎగుమతులు రెట్టింపయ్యాయి : కేటీఆర్
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ :
రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు రెట్టింపు స్థాయిలో పెరిగాయని ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన ఐటీ టవర్స్‌ను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఐటీ టవర్ ప్రారంభం రోజునే 432 మంది యువతకు ఉద్యోగాలు రావడం సంతోషంకరమన్నారు.రాష్ట్రంతో తమ ప్రభుత్వం వచ్చిన కొత్తలో 56 వేల కోట్ల ఐటీ ఎగుమతులు ఉండేవని‌, ఇప్పుడు అవి లక్షా 28 వేల కోట్లకు చేరుకున్నాయన్నారు. ఈ రంగంలో ప్రైవేటు రంగందే మొత్తం హవా అన్నారు. కేవలం టాలెంట్ అనేది హైదరాబాద్, బెంగుళూర్, ఢిల్లీ లాంటి నగరాలకు విద్యార్థులకే సొంతం కాదని, దానిని అన్ని ప్రాంతాల వారూ అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.

ద్వితీయ శ్రేణి పట్టణాలు, నగరాల్లోని నైపుణ్యవంతులైన యువత ఇతర నగరాలకు వలస పోవాల్సి వస్తోందని చెప్పుకొచ్చారు. ఐటీ నిర్వచనం మార్చాల్సి ఉందని.. ‘‘ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదు.. ఇప్పుడు ఇంటెలిజెన్స్ టెక్నాలజీగా’’ మార్చాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎన్నో విజయాలు సాధించవచ్చని, మాస్కులు ధరించారా లేదా అని గుర్తించే యాప్ పోలీసులు వాడుతున్నారని తెలిపారు.తెలివైన యువతీ, యువకులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఎన్నో అద్భుత విజయాలు సాధిస్తున్నారని గుర్తుచేశారు. స్థానిక యువతలో ఉన్న టాలెంట్ ను గుర్తించి ప్రోత్సహించాలన్నదే తమ లక్ష్యమని, డిజిటల్ వాలెట్ (ఎం-వ్యాలెట్ ) వచ్చిన తర్వాత వాహనదారులు తమ వెంట లైసెన్స్, ఇతర అనుమతి పత్రాలు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా పోయిందన్నారు. ఇలాంటి ఇన్నోవేటివ్ ఆలోచనలు కార్యరూపం దాల్చాలని సూచించారు.
కోవిడ్ సంక్షోభం వల్ల ఐటీ టవర్‌లో స్టార్టప్ కంపెనీలకు జనవరి వరకు ఎలాంటి అద్దె లేకుండా చూస్తామన్నారు.

కరీంనగర్‌లో మరో టవర్ కూడా నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేటీఆర్ స్పష్టంచేశారు. విదేశాల్లో ఐటీ సంస్థలు నడుపుతున్న ఎన్.ఆర్.ఐలు జిల్లాలోని ఐటీ టవర్‌లో కూడా తమ సంస్థలు స్థాపించాలన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేలా ఇదే టవర్‌లో టాస్క్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వరంగల్‌లో టెక్ మహీంద్రలాంటి సంస్థలు వచ్చాయని, ఇక్కడికి కూడా అలాంటి పెద్ద సంస్థలు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తామన్నారు. కరీంనగర్‌లో ఐటీ రంగం మరిన్ని మెట్లెక్కి వేలాది మందికి ఉపాధి కల్పించే కేంద్రంగా ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. ఒకప్పుడు తాగునీటి కోసం అల్లాడే ప్రజలకు ఇప్పుడు 24 గంటల మంచినీరు ఇచ్చే పనులు సాగుతున్నాయని, రానున్న ఐదు, పదేళ్లలో హై స్పీడ్ రైళ్లు వస్తే కరీంనగర్- హైదరాబాద్ కు 45 నిమిషాల్లో వెళ్లే పరిస్థితి రానుందని మంత్రి తెలిపారు.

Next Story

Most Viewed