LMD కట్టపై ‘లేక్ పోలీసుల’ నిఘా..!

by  |
LMD కట్టపై ‘లేక్ పోలీసుల’ నిఘా..!
X

కరీంనగర్ శివారులోని ఎల్‌ఎండీ సమీపంలో అసాంఘిక కార్యక్రమాలను నిలువరించేందుకు లేక్ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. కానీ ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో వచ్చి పోయే వారిపైనే లేక్ పోలీసులు ఎక్కువ దృష్టి పెట్టాల్సి వస్తోంది. కట్టపై అనుమానాస్పదంగా కనబడిన వారితో మాట్లాడి.. ఆత్మహత్య చేసుకుందుకే వస్తే సముదాయిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 128 మందిని కాపాడారు.

దిశ ప్రతినిధి, కరీంనగర్: లోయర్ మానేర్ డ్యాం కట్టపైకి ఇద్దరు పిల్లలతో ఓ మహిళ వచ్చింది. అటూ ఇటూ చూస్తూ ఆందోళనగా ఉంది. అప్పటికే కట్టపై మఫ్టీలో ఉన్న పోలీసులు ఆమె వద్దకు వెళ్లారు. మేడం మీరెందుకు ఇక్కడకు వచ్చారని అడిగారు. డ్యాం చూసేందుకే వచ్చానని తడబడుతూ చెప్పింది. మెళ్లిగా మాటల్లోకి దింపి.. ఫ్యామిలీ డిటెయిల్స్ అడిగి పూర్తి వివరాలు సేకరించారు. చివరకు ఆ మహిళ కట్టపైకి ఎందుకు వచ్చిందో చెప్పింది. తన కుటుంబంలో నెలకొన్న సమస్యలతో చనిపోవాలని భావించానని కన్నీటి పర్యంతం అయింది. అమ్మా.. చావే అన్నింటికి పరిష్కారం కాదు, మీకు ఎదురైన సమస్యల పరిష్కారానికి మార్గం అన్వేశించాలే తప్ప.. సూసైడ్ చేసుకోవడం సరికాదని ఆమెను లేక్ ఠాణాకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు.

కరీంనగర్ లోయర్ మానేర్ డ్యాం కట్టపై ఆత్మహత్య చేసుకునేందుకు నిత్యం ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి వారిని కాపాడుతున్నారు. ఇంట్లో సమస్యలు తట్టుకోలేక.. ప్రేమ విఫలం అయి.. ఆర్థిక ఇబ్బందులతో డ్యాంలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని ఫిక్స్ అయి వస్తున్నారు. అలాంటి వారిని లేక్ పోలీసులు గుర్తించి, వారితో మాట్లాడి సముదాయిస్తున్నారు. వాస్తవంగా ఎల్ఎండీ సమీపంలో అసాంఘిక కార్యకలాపాలను నిలువరించేందుకు ప్రత్యేకంగా లేక్ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో ఓపెన్ డ్రింక్ చేయడంతో పాటు, ఇతరత్రా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న విషయాన్ని గమనించిన సీపీ కమలాసన్ రెడ్డి లేక్ ఔట్ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. డ్యాం కరకట్టతో పాటు సమీప ప్రాంతాల్లో జరిగే చట్టవ్యతిరేక కార్యకలాపాలను నిలువరించాలని ఏర్పాటు చేశారు.

సూసైడ్ చేసుకునే వారిపైనే దృష్టి..

ఇటీవల కాలంలో డ్యాంలో దూకి చనిపోయేందుకు వస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. దీంతో పోలీసులు సూసైడ్ చేసుకునే వారిని కట్టడి చేసేందుకే దృష్టి సారించారు. ఇప్పటి వరకు సుమారు 128 మందిని లేక్ పోలీసులు కాపాడారు. బాధిత కుటుంబాల నుంచి ఫోన్ వచ్చిన వెంటనే స్పందించి కరకట్ట అంతా కలియ తిరుగుతూ అనుమానితులను విచారించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించే పనిలో నిమగ్నం అయ్యారు.

పర్యాటకులపై నిఘా..

నిరంతరం గస్తీ తిరుగుతున్న పోలీసులు సందర్శకుల మాటున వచ్చే వారిని ప్రత్యేకంగా అబ్జర్వ్ చేస్తూ అనుమానం వచ్చిన వెంటనే వారిని వెంబడించి వారి కదలికలను గమనించి కాపాడుతున్నారు. ఇటీవల డ్యాంలోకి భారిగా వరద నీరు రావడం గేట్లు కూడా తెరిచి దిగువకు నీటిని వదులుతుండడంతో సందర్శకులు సంఖ్య కూడా పెరిగింది. ఈ రద్దీలో కూడా సూసైడ్ చేసుకునేందుకు వస్తున్న వారిని గమనించి కాపాడుతున్నారు. లేక్ ఠాణా ఏర్పాటు లక్ష్యం వేరే అయినా దానివల్ల ప్రాణాలు కాపాడే పని ప్రధానంగా మారిపోవడం గమనార్హం. ఏదేమైనా పోలీసులు మాత్రం ఆత్మహత్యలను నిలువరించడంలో సక్సెస్ అవుతున్నారనే చెప్పాలి.


Next Story

Most Viewed