బీజేపీనేతలు చౌకబారు రాజకీయాలు మానుకోవాలి.. కడియం హెచ్చరిక

by Shyam |
బీజేపీనేతలు చౌకబారు రాజకీయాలు మానుకోవాలి.. కడియం హెచ్చరిక
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ రైతు, దళిత వ్యతిరేక పార్టీ అని, అలాంటి పార్టీని బొంద పెట్టాలని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ప్రజలకు పిలుపునిచ్చారు. చౌకబారు రాజకీయాలను బీజేపీ నేతలు మానుకోవాలని సూచించారు. చేతనైతే ప్రాజెక్టులు, నిధులు తేవాలని సూచించారు. రాబోయే రోజుల్లో బీజేపీ వ్యతిరేక శక్తులు (యాంటీ బీజేపీ ఫోర్స్) కేసీఆర్ నాయకత్వంలో ఏకం కాబోతున్నాయని, ఎలా పనిచేయాలో సీఎం కేసీఆర్ నిర్ణయిస్తారని… ప్రస్తుత తరుణంలో రాజకీయ అవసరం ఉందన్నారు. తెలంగాణ భవన్ లో మంగళవారం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, మాజీ ఎమ్మెల్సీ ఎం. శ్రీనివాస్ రెడ్డి, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం అద్భుత ప్రగతి సాధించిందన్నారు. సంక్షేమ రంగంపై 50వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రాష్ట్రం లేదని, అభివృద్ధికి సహకరించాల్సిన బీజేపీ నాయకులు మోకాలడ్డుతున్నారని మండిపడ్డారు. కేంద్రం తీరుతోనే సమాజంలో అసమానతలు పెరుగుతున్నాయని మండిపడ్డారు. 10 శాతం జనాభా చేతిలో 57 శాతం దేశ సంపద ఉందన్నారు. బండి సంజయ్ ఎవరి కోసం దీక్ష చేపట్టారో చెప్పాలని, రాష్ట్ర బీజేపీ నేతలకు అసలు సిగ్గుందా? అని ప్రశ్నించారు. కుల వ్యవస్థ, మత విశ్వాసాలను బీజేపీ రెచ్చగొడుతుందని… ఆ కుట్రలను పసిగట్టి తిప్పికొట్టాలన్నారు. త్వరలోనే ప్రజలు బీజేపీకి చావుదెబ్బ కొట్టనున్నారన్నారు.

యూపీ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ దెబ్బకు అమిత్ షా, మోడీలు ఆసుపత్రుల పాలుకావడం ఖాయమని జోస్యం చెప్పారు. పంజాబ్ లో ఆప్ దెబ్బకుబీజేపీ విలవిలలాడుతోందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన బీహార్ లో నితీష్ కుమార్ మద్దతుతోనేనని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు తెలంగాణకు ఏం ఇచ్చినందుకు మిడిసి పడుతున్నారో అర్ధం కావడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చారనా? మెడికల్ కళాశాలలు మంజూరు చేయించారనా? విభజన హామీలైన బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ తీసుకువచ్చారా? అని ప్రశ్నించారు. వీటిపై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎంను ఏకవచనంతో మాట్లాడటం మానుకోవాలని సూచించారు.

Advertisement

Next Story