యూఏఈ చేరుకున్న బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్

by  |
యూఏఈ చేరుకున్న బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్
X

దిశ, స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ వంటి లీగ్స్‌కు బెట్టింగ్, ఫిక్సింగ్ వంటి తెరవెనుక వ్యవహారాలు సాధారణమే. గతంలో కూడా ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్‌లు వెలుగు చూశాయి. అప్పటి నుంచి బీసీసీఐ ప్రత్యేకంగా యాంటీ కరప్షన్ యూనిట్ (ఏసీయూ)ని ఏర్పాటు చేసింది. టీమ్ ఇండియా ఆడే మ్యాచ్‌లనే కాకుండా ఐపీఎల్‌ను ఈ ఏసీయూ నిశితంగా గమనిస్తూ ఉంటుంది. ఆటగాళ్లు, కోచ్‌లు, ఇతర సిబ్బంది కదలికలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తుంటుంది.

మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుండటంతో బీసీసీఐ ఏసీయూ యూఏఈ చేరుకుంది. సీనియర్ పోలీస్ అధికారి అజిత్ సింగ్ నేతృత్వంలోని ఎనిమిది మంది సభ్యులు గల ఏసీయూ మంగళవారమే యూఏఈ చేరుకున్నారు. ప్రస్తుతం వాళ్లందరూ క్వారంటైన్‌లో ఉన్నారు. క్వారంటైన్ ముగిసిన వెంటనే వాళ్లు బయోబబుల్‌లోకి ప్రవేశిస్తారు. ఏసీయూ బృందం ముందుగా ఆటగాళ్లందరితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన తరగతులు నిర్వహిస్తారు.

బుకీలు, పంటర్లు ఎలా సంప్రదిస్తుంటారు? ఒక వేళ సంప్రదిస్తే ఆటగాళ్లు ఎలా స్పందించాలి? వెంటనే ఎవరికి ఫిర్యాదు చేయాలనే విషయాలను ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించనున్నారు. ఈ సారి ప్రేక్షకులకు అనుమతి లేదు కాబట్టి.. హోటల్స్ రూమ్‌లో, లాబీల్లో ఆటగాళ్లను కలిసే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుందని ఏసీయూ భావిస్తోంది. బయోబబుల్‌‌తో ఏసీయూ పని కొంచెం సులువు కానుందని, గతంలో కంటే కఠినంగా వ్యవహరిస్తామని అజిత్ సింగ్ చెప్పారు. ఆటగాళ్లు సోషల్ మీడియాకు ముఖ్యంగా వాట్సప్‌ను వినియోగించడం తగ్గించాలని అజిత్ సూచించారు. ఏసీయూ తమ రోజు వారీ కార్యాకలపాలను బీసీసీఐ, ఐసీసీకి నివేదించనుంది.


Next Story

Most Viewed