జియోలో మరో బడా కంపెనీ పెట్టుబడులు!

by  |
జియోలో మరో బడా కంపెనీ పెట్టుబడులు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ టెలికాం జియోలో పెట్టుబడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ బడా కంపెనీలు భారీ పెట్టుబడులు పెట్టగా తాజాగా అమెరికాకు చెందిన మరో బడా కంపెనీ ఇంటెల్ కార్పొరేషన్ ఇన్వెస్ట్‌మెంట్ విభాగం ఇంటెల్ కేపిటల్ జియోలో 0.39 శాతం పెట్టుబడుల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ రూ. 1,894.50 కోట్లు. ఆర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్, డాటా సెంటర్ అండ్ క్లౌడ్, 5జీ, నెక్స్ట్ జనరేషన్ కంప్యూటర్‌లలో కొనసాగుతున్న ఇంటెల్ కేపిటల్ ఇన్నోవేటివ్ ఈ పెట్టుబడులను పెడుతోంది. ఈ సంస్స్థ ఇప్పటివరకు అంతర్జాతీయంగా 1,582 కంపెనీల్లో, 692 పోర్ట్‌ఫోలియో కంపెనీల్లో 12.9 బిలియన్ డాలర్లను పెట్టుబడులుగా పెట్టింది. ఇక, ఇంటెల్ మల్టీ నేషనల్ కంపెనీ భారత్‌లో గత రెండు దశాబ్దాలుగా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. మొత్తం 2,000 మందివరకు ఉద్యోగులున్నారు. వీరిలో 1200 మంది డెవలప్‌మెంట్ సెంటర్‌లో పనిచేస్తున్నారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ, ఇంటెల్ ఒక ‘నమ్మకమైన సంస్థ’, ఇది ప్రపంచాన్ని మార్చే సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలను రూపొందించడానికి కృషి చేస్తోంది. ‘ఇంటెల్ క్యాపిటల్ ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ టెక్నాలజీ కంపెనీలకు విలువైన భాగస్వామిగా ఉంది. ఈ సంస్థతో ఒపందం వల్ల మనదేశ ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలను మెరుగుపరిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, సామర్థ్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఇంటెల్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని’ ఆయన అన్నారు. ఇంటెల్ క్యాపిటల్ ప్రెసిడెంట్ వెండెల్ బ్రూక్స్ మాట్లాడుతూ, భారత్‌లో డిజిటల్ పరివర్తనకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ‘తక్కువ ఖర్చుతో కూడిన డిజిటల్ సేవలను భారత్‌కు తీసుకురావడానికి జియో ఇంటెల్ సిద్ధంగా ఉంది’ అన్నారు.


Next Story

Most Viewed