భారత్‌లో కనిపించనున్న అరుదైన తోక చుక్క

by  |
భారత్‌లో కనిపించనున్న అరుదైన తోక చుక్క
X

అరుదైన నియోవైస్ (NEOWISE) తోక చుక్క భారతదేశంలో వారం రోజుల పాటు కనిపించనుంది. శాస్త్రీయంగా సీ/2020 ఎఫ్3 అని పిలిచే ఈ తోకచుక్క జులై 14 నుంచి భారతీయులు చూడవచ్చని ఒడిశాలోని ‘పతని సమంత ప్లానెటోరియం’ డిప్యూటీ డైరెక్టర్ శుబేందు పట్నాయక్ వెల్లడించారు. ఎలాంటి టెలిస్కోప్‌లు, కళ్లద్దాలు అవసరం లేకుండా ఈ తోకచుక్కను ఆకాశంలో వాయవ్యం వైపున చూడవచ్చని ఆయన పేర్కొన్నారు. మార్చి నెలలో అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం (నాసా) వారి నియర్ ఎర్త్ వైడ్-ఫీల్డ్ ఇన్‌ఫ్రారెడ్ సర్వే ఎక్స్‌ప్లోరర్ (నియోవైస్) టెలిస్కోప్ ఈ తోకచుక్కను మొదటిసారిగా గుర్తించింది. జులై 22-23 తేదీల్లో ఇది భూమికి అతిదగ్గరగా రానున్నప్పటికీ, అంతకు వారం రోజుల ముందే ఆకాశంలో ఇది కనిపిస్తుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

జులై 14వ తారీఖు నుంచి 20 రోజుల పాటు సూర్యాస్తమయం తర్వాత 20 నిమిషాల పాటు ఈ తోకచుక్క కనిపిస్తుందని శుబేందు పట్నాయక్ తెలిపారు. ఆగస్టు నెలలో ఈ తోకచుక్క నెమ్మదిగా మాయమవుతుంది. ఆ తర్వాత మానవ కంటితో కనిపించకపోయినా, టెలిస్కోప్ ద్వారా చూడాల్సి వస్తుంది. ప్రస్తుతం ఈ తోక చుక్క భూమికి 200 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. అది భూమిని దాటుతూ 64 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నపుడు కనిపించనుంది. ఈ తోకచుక్క మళ్లీ 6000ల సంవత్సరాల తర్వాత అంటే 8786వ సంవత్సరంలో కనిపించనుంది. అంత అరుదైనది కాబట్టే గతవారం ఈ తోకచుక్కకు సంబంధించిన ఫొటోలను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి నాసా వ్యోమగామి బాబ్ బెంకెన్ క్యాప్చర్ చేసి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.


Next Story

Most Viewed