రెండో దశ పోలింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గె ఓటర్లకు కీలక సందేశం

by Dishanational1 |
రెండో దశ పోలింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గె ఓటర్లకు కీలక సందేశం
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గె శుక్రవారం ఓటర్లకు కీలక సందేశం ఇచ్చారు. ముఖ్యంగా మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లను ఉద్దేశిస్తూ.. బీజేపీ 'డైవర్ట్' రాజకీయ వ్యూహాల్లో పడవద్దని, ఇవి ప్రజాస్వామ్యాన్ని రక్షించే ఎన్నికలని, నియంతృత్వ బారి నుంచి రక్షించాలని కోరారు. 'భారత రాజ్యాంగానికి ఆత్మ లాంటి ప్రజలందరికీ ఇదే నా విన్నపం. ఈ ఎన్నికలు సాధారణమైనవి కాదని మర్చిపోవద్దు. నియంతృత్వ బారి నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు జరుగుతున్న ఎన్నికలు. పోలింగ్ జరుగుతున్న 13 రాష్ట్రాలు, యూటీలలోని 89 నియోజకవర్గాల ప్రజలందరూ ఎటువంటి డైవర్ట్ రాజకీయ వ్యూహాలకు, అబద్దాలకు లొంగకుండా ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నాను' అని ఖర్గె ఎక్స్‌లో ట్వీట్ చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టో 'న్యాయ్ పత్ర్' హామీలను ప్రజలకు గుర్తుచేస్తూ ప్రజలు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, భవిష్యత్తు కోసం నిర్ణయం తీసుకోండి. ముఖ్యంగా మొదటిసారి ఓటు వేసేవారు అయోమయాన్ని వీడి, ఛేంజ్ మేకర్స్‌లా మారి ఓటు హక్కును వినియోగించాలని ఖర్గె పేర్కొన్నారు.



Next Story

Most Viewed