అడువుల్లో మళ్లీ మావోల అలజడి

by  |
అడువుల్లో మళ్లీ మావోల అలజడి
X

దిశ, ఆదిలాబాద్: తెలంగాణలో మళ్లీ మావోల అలజడి మొదలైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మావోయిస్టు పార్టీ కార్యదర్శి భాస్కర్ అలియాస్ మైలారపు అడెల్లు కోసం గ్రేహౌండ్స్ దళాలు వేట ప్రారంభించాయి. గత కొంతకాలంగా ఛత్తీస్‌ఘడ్‌లో తలదాచుకుంటున్న భాస్కర్ ఇటీవల ఆదిలాబాద్ అడవుల్లోకి దళాలతో కలిసి ప్రవేశించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. దట్టమైన అటవీ ప్రాంతంగా పేరున్న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని, మంగి అడవుల్లో భాస్కర్ మకాం వేసినట్లు సమాచారం అందటంతో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. మరో వైపు ఆయన స్వగ్రామం బోథ్ మండలం పొచ్చెర గ్రామం కావడంతో.. బోథ్, సారంగాపూర్ అటవీ ప్రాంతాల్లోనూ పోలీసుల కూంబింగ్ సాగుతోంది.

గతంలో భాస్కర్ కోసం పోలీసులు చేసిన లొంగుబాటు ప్రయత్నాలు విఫలంకావడంతో సుదీర్ఘకాలంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పోలీసులు ఆయన కోసం వేట సాగిస్తున్నారు. అనేకసార్లు ఆయన స్వగ్రామం పొచ్చెర, అతని భార్య గ్రామంలోనూ పోలీసులు మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించి జనజీవన స్రవంతిలో కలవాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఛత్తీస్‌ఘడ్ అడువులకు వెళ్లిన భాస్కర్ మళ్లీ దళాలతో కలిసి జిల్లా అడవుల్లోకి వచ్చాడన్న సమాచారం పోలీసు వర్గాలను కలవరపెడుతుంది.


Next Story

Most Viewed