ఏపీలో ఉచిత డిజిటల్ సెంటర్?

by  |
ఏపీలో ఉచిత డిజిటల్ సెంటర్?
X

దిశ ఏపీ బ్యూరో: ఏపీలో కరోనా వైరస్‌ ప్రమాదకర స్థాయిలో వ్యాపిస్తోంది. ఏపీతో పాటు ప్రపంచాన్ని వైరస్ వణికిస్తోంది. ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోంకి ప్రాముఖ్యతనిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని అన్ని రంగాలు డిజిటలైజేషన్ దిశగా నడుస్తున్నాయి. దీనికి తోడు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోంని మరింత కాలం కొనసాగిస్తున్నాయి. దీనికి అనుగుణంగా ఏపీలో ఇంటర్నెట్‌ వ్యవస్థను పటిష్టం చేయాలని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలోని ఐటీ ఉద్యోగుల్లో 70 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోంలో ఉన్నారని ఆయన వెల్లడించారు. వారందరికీ ఇంటర్నెట్ కనెక్టివిటీలో ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచనలు చేశారు. ఈ మేరకు పరిశ్రమల శాఖ, ఐటీ శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్క్‌హోమ్‌ డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత సేవలందించేలా డిజిటల్‌ సెంటర్‌ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కీలకంగా మారిందన్న ఆయన సైబర్ నేరాలకు ఆస్కారం లేని సెక్యూరిటీకి సేవలకు అధిక ప్రాధాన్యతనివ్వాలని చెప్పారు. ఉపాధి కల్పన లక్ష్యంగా డిజిటల్‌ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్‌ఛేంజ్ ఏర్పాటు చేయాలని అన్నారు. సొసైటీ ఫర్‌ ఆంధ్రప్రదేశ్‌ నెట్‌ వర్క్స్‌ (శాప్‌నెట్‌)ను ఐ అండ్‌ పీఆర్‌ లేదా విద్యా శాఖలోకి, ఏపీ సైబర్‌ సెక్యూరిటీ ఆపరేషన్స్‌ సెంటర్‌ను ఆర్టీజీఎస్‌ పరిధిలోకి, ఆంధ్రప్రదేశ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అకాడమీ(అపితా), ఆంధ్రప్రదేశ్‌ స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌లను ఫైబర్‌ నెట్‌ పరిధిలోకి తీసుకువచ్చేలా ప్రణాళిక రూపకల్పన చేయాలని సూచించారు.

మరోవైపు అక్టోబర్‌లో 5 స్కిల్ కాలేజీలను ప్రారంభించనున్నామని తెలిపారు. చదువు విలువను ప్రపంచానికి చాటిన గాంధీ జయంతి రోజు 4 స్కిల్‌ కాలేజీల ప్రారంభం చేయనున్నామని చెప్పారు. కడప, ఏలూరు, ఒంగోలు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో ఈ ఐదు స్కిల్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తామని అన్నారు. వచ్చే జనవరిలో మరో 25 స్కిల్‌ కాలేజీలను ప్రారంభిస్తామని తెలిపారు. ఈ 30 స్కిల్ కాలేజీల పనుల పర్యవేక్షణకు ‘ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్’ను ఏర్పాటు చేయనున్నామని అన్నారు. అక్టోబర్‌లో ప్రారంభించే 5 కాలేజీలు పూర్తయ్యాయన్న ఆయన, ఈ కాలేజీల డిజైన్లు, లేఔట్లకు తుది మెరుగులు దిద్దుతున్నామని వెల్లడించారు.

గతేడాది నైపుణ్యాశాఖకు చెందిన టీమ్ భువనేశ్వర్‌లోని సెంచూరియన్ స్కిల్ యూనివర్సిటీలో పర్యటించిందన్న ఆయన దీనికి దీటైన సౌకర్యాలతో ఏపీలో స్కిల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వీటికి సంబంధించిన ప్లానింగ్, నిర్మాణ బాధ్యతలు నిర్వర్తించే ఆర్కిటెక్‌ బృందం కూడా సెంచూరియన్ యూనివర్సిటీలో పర్యటించనుందని తెలిపారు. వీటి నిర్మాణం, ఏర్పాటులో ఆర్థికపరమైన ఇబ్బందులు రాకుండా సీఎస్ఆర్ నిధుల సమీకరణపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు.

ఇందుకోసం త్వరలో కోర్సులు, సిలబస్, క్యాలెండర్ ఏర్పాటుపై హై నెట్ వర్క్ ఇండస్ట్రీస్ వర్చువల్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నామని ఆయన వెల్లడించారు. ఈ కాలేజీల్లో కరికులమ్ టాప్ కంపెనీల నిపుణులు, విద్యావేత్తలతో చర్చించి ఆమోదించనున్నామని తెలిపారు. ఇప్పటికే భవిష్యత్‌లో ఉద్యోగావకాశాలు విరివిగా ఉండే 20 కోర్సులపై అధ్యయనం చేశామని ఆయన చెప్పారు. ఇందులో ప్రపంచ స్థాయి నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, ఉపాధి వంటి వాటిని ఐఎస్‌బీ నిర్వహించనుందని వెల్లడించారు. దీనిపై త్వరలోనే యాప్ ద్వారా సర్వే నిర్వహిస్తామని ఆయన తెలిపారు.


Next Story

Most Viewed