38మంది పోలీసులకు కరోనా పాజిటివ్

by vinod kumar |   ( Updated:2020-06-01 04:41:29.0  )
38మంది పోలీసులకు కరోనా పాజిటివ్
X

దిశ, క్రైమ్ బ్యూరో :
రాష్ట్రంలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులు క్రమంగా కరోనా వైరస్ బారిన పడుతున్నారు.ఇప్పటివరకు 38 మందికి పాజిటివ్‌ నిర్దారణ అయ్యింది.ఇందులో సీఐ మొదలు కానిస్టేబుల్ స్థాయి వారు కూడా ఉన్నారు. ప్రస్తుతం వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పనిచేస్తున్న సుమారు 30 మంది క్వారంటైన్‌లో ఉన్నారు. కరోనా నివారణకు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నగాంధీ ఆస్పత్రి వద్ద విధులు నిర్వర్తించే పోలీసులకు ఇన్‌ఫెక్షన్ సోకుతోంది. వీరిలో చిక్కడపల్లి, చిలుకలగూడ పోలీసులే ఎక్కువగా ఉన్నారు. కంటైన్‌మెంట్ జోన్లు ఉన్న ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులు కూడా ఈ మధ్య వైరస్ బారిన పడుతున్నారు.దీంతో ఇప్పుడు నగర పోలీసులకు కరోనా ఫీవర్ పట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కరోనా సోకిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతోంది.

పాజిటివ్‌తో కానిస్టేబుల్ మృతి

నగరంలోని కుల్సుంపుర పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ కరోనా కారణంగా చనిపోయారు. అది తెలిసిన నగర సీపీ స్వయంగా ఆ స్టేషన్‌కు వెళ్ళి నివాళులర్పించారు. ఇప్పుడు కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటం, ఆంక్షలను కూడా సడలించడంతో ఎప్పుడు ఎవరి ద్వారా వైరస్ అటాక్ చేస్తుందోనని విధుల్లో ఉన్న పోలీసులు, సిబ్బంది జంకుతున్నారు. నెల రోజుల కిందట సచివాలయం సమీపంలో విధి నిర్వహణలో ఉన్న ఒక పోలీసుకు కరోనా పాజిటివ్ వస్తే స్టేషన్‌లోని మిగిలిన సిబ్బందిని క్వారంటైన్‌కు పంపారు.ఇప్పుడు ఏకంగా 38 మందికి పాజిటివ్ అని తేలడంతో డ్యూటీలో ఉన్నంతసేపు ఇన్‌ఫెక్షన్ వస్తుందేమోనన్న అనుమానంతో బిక్కుబిక్కుమంటున్నారు. పోలీసు ఉన్నతాధికారులు వాస్తవాన్ని దాచిపెడుతున్నా సహచర పోలీసులకు మాత్రం తెలిసిపోయింది. కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకున్న నగర పోలీసు కమిషనర్ ప్రత్యేకంగా పోలీసులకు గోషా మహల్ స్టేడియంలో వైద్యారోగ్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. లక్షణాలున్నట్లు అనుమానం వస్తే వారికి కరోనా నిర్దారణ పరీక్షలు చేయిస్తున్నారు. పాజిటివ్ తేలినవారిని గాంధీ ఆస్పత్రికి తరలిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed