ఆర్థిక ఉల్లంఘనకు చర్యలేవి..?

by Ravi |   ( Updated:2024-10-22 00:31:07.0  )
ఆర్థిక ఉల్లంఘనకు చర్యలేవి..?
X

స్వాతంత్రం వచ్చాక దేశంలో అనేక స్కాంలు బయటకు వచ్చాయి తప్ప నేరం రుజువై ఆస్తులు జప్తు కానీ, ఆర్థిక ఉల్లంఘన చేసిన వారిని కఠినంగా శిక్షించడం గాని జరగలేదు. భారతదేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల సమయాలలో ఓట్లు అడిగే సమయంలో గత ప్రభుత్వం స్కాం చేసింది. మేం అధికారంలోకి వస్తే వాళ్లు చేసిన స్కాం బయటపెడతాం వాళ్లకు శిక్షపడేలా చేస్తామని ఓట్లు దండుకుంటున్నారు. ఆ తర్వాత రాజకీయ నాయకులంతా ఒకటే. కనీసం ఒక్క స్కాం కూడా బయటపెట్టకుండా వాళ్లలో వారు ఎంతగా సపోర్ట్ చేసుకుంటున్నారు. దీనిని ఇప్పటికైనా ప్రజలు గమనించాలి.

బడా వ్యాపారులు బ్యాంకులలో లోన్లు తీసుకుని విదేశాలకు పారిపోయి సంవత్సరాలు గడుస్తున్నా కనీసం ఏమీ చేయలేని పరిస్థితులలో మన వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ఆర్థిక ఉల్లంఘన చేసిన వారిని కఠినంగా శిక్షిస్తే ఇంకొకరు తప్పు చేయడానికి భయపడే పరిస్థితులు ఏర్పడతాయి. మా ప్రభుత్వమే ఉందిలే మేమే చూసుకుంటాం వాళ్లు మేం అంతా ఒకటే ఏం చేసినా తర్వాత అయినా చెల్లుతుందిలే అని కొందరు నాయకులు అయితే ప్రజాధనాన్ని దాదాపుగా పది తరాలకు సరిపడే విధంగా ఆర్థిక వనరులను తయారు చేసుకుంటున్నారు.

స్కాం పేరుతో కాలం వెళ్లదీయడమే..

కొందరు ప్రజా ప్రతినిధులు ప్రెస్‌మీట్ పెట్టి అందులో ఇంత స్కాం జరిగింది ఇందులో అంత స్కాం జరిగిందని చెబుతుంటారు. దానిని నిరూపించి శిక్షపడేలా చొరవ చూపడంలో మాత్రం విఫలమైతున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2జీ స్కాం బయటపడింది. అప్పట్లో ఈ స్కాం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ స్కాం పురోగతి ఏమిటో తెలియదు. టెక్నాలజీ ఇంత పెరిగినా అనేక కేసులలో రాజకీయ ఒత్తిడితో నిజానిజాలను తేల్చడంలో సంబంధిత అధికారులకు తలనొప్పిగా మారింది. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అప్పటీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లలో పెద్ద స్కాం జరిగిందని దాని త్వరలోనే బయటపెడతామని అన్నారు. విచారణ కోసమే కమిటీ కూడా వేశారు. కానీ గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ఏ ఒక్కరిని కూడా ఆ స్కాంలో భాగంగా అరెస్టులు చేయలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక లక్ష నాగళ్లతో రామోజీ ఫిలిం సిటీని దున్నేస్తానని చెప్పినా అది జరగలేదు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటే అసలు రాజకీయ నాయకులు అందరూ ఒకటే.. దేశంలోనైనా ఇటు రాష్ట్రంలోనైనా ఏ ఒక్క స్కాంలోనైనా తప్పు చేసిన వారికి శిక్ష పడుతుందనే నమ్మకం లేకుండా పోయింది. దేశంలో రాజకీయ నాయకులు ఉత్తమ పలుకు బడిని తమ పదవిని అడ్డం పెట్టుకొని కొన్ని వేల కోట్ల రూపాయలను కొల్లగొడుతూ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారు.

టెండర్ వివరాలు బహిర్గతం చేయాలి..!

ప్రభుత్వ పనులకు సంబంధించిన టెండర్లు నిర్వహించేటప్పుడు ఆ టెండర్ వివరాలను ప్రజలకు ఎందుకు వివరించలేకపోతున్నారో ప్రజలు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్న చిన్న కాంట్రాక్టర్ నుంచి పెద్ద కంపెనీల వరకు ప్రభుత్వం నుంచి వెలుపడే ప్రతి టెండర్ ప్రజా ప్రతినిధులకు సంబంధించిన కంపెనీలకే వస్తు న్నాయి. ప్రభుత్వంలో ఏ చిన్న పథకాన్ని లాంచ్ చేసినా ప్రభుత్వం పేపర్ ప్రకటనలతో పాటు సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేస్తుంది. కానీ వేలకోట్ల పనుల టెండర్లుకు బహిరంగ ప్రకటనలు ఎందుకు చేయలేకపోతున్నారు? ప్రజల ముందు ఎందుకు పెట్టలేకపోతున్నారో.. అందులో ఉన్న ఆంతర్యమేమిటో వాళ్లకే తెలియాలి. ప్రజలకు తెలియజేస్తే అ టెండర్ ఏ కంపెనీకి దక్కింది ఆ కంపెనీ తాలూకు వివరాలు, కంపెనీ స్ట్రాటజీ ఏమిటి అనేది ప్రజలకు తెలిసి పోతుంది. అందుకే ప్రజలకు తెలుపడం లేదు.

చట్టాలు కఠిన తరం చేయాలి..

ఆర్థిక ఉల్లంఘనకు పాల్పడిన వ్యక్తులు కఠినంగా శిక్షించబడాలి. భారత దేశ వ్యవస్థలో ఇప్పటివరకు కొన్ని జరిగిన సంఘటనలలో ఆర్థిక ఉల్లంఘనలో బ్యాంకులు వ్యవహరించిన తీరులో ప్రజా ప్రతినిధులకు, వ్యాపార వేత్తలకు ఒకరకంగా సామాన్య ప్రజలకు మరో రకంగా వ్యవహరించడం మనమందరం గమనించాం. అలా ఎందుకు జరగాలి? తప్పుచేసిన వారు ఎవరైనా సరే సమానమే కదా? సామాన్యులకు ఒక న్యాయం ప్రజాప్రతినిధులకు వ్యాపారవేత్తలకు మరొక న్యాయమా? అధికారులు వ్యవహార తీరు బాధ కలిగిస్తుంది. గల్ఫ్ దేశాలలో ఆర్థిక ఉల్లంఘన చేస్తే శిక్షించబడే చట్టాలు కఠినంగా ఉన్నాయి. మన భారతదేశంలో కూడా చట్టాలు కఠినతరం చేయాలని ఒక భారతీయ పౌరుడిగా కోరుకుంటున్నా.. తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వమైనా గత పది సంవత్సరాలలో జరిగిన కుంభకోణాలను బయట పెట్టి వారిని కఠినంగా శిక్షించి వారి వద్ద నుండి ఆస్తులు జప్తు చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందో లేదో వేచి చూడాలి.

- సింగిరెడ్డి అశోక్ రెడ్డి

76618 01107

Advertisement

Next Story

Most Viewed