యూపీఎస్, కొత్త సీసాలో పాత సారా...

by Ravi |   ( Updated:2024-08-27 01:01:16.0  )
యూపీఎస్, కొత్త సీసాలో పాత సారా...
X

దాదాపు 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సామాజిక, ఆర్థిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కొత్త సీసాలో పాత సారాలా ఉంది. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌కు రూపాంతరమే ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీం (యూపీఎస్). 2004కు పూర్వం నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీం(ఓపీఎస్) ఉండేది. పాలకులు ఉద్యోగుల సంక్షేమాన్ని పక్కనబెట్టి అమలులో ఉన్న పాత పెన్షన్ స్కీంకు బదులు కొత్త పెన్షన్ స్కీమ్(CPS) తీసుకువచ్చారు. ఈ ఓపీఎస్, సీపీఎస్, యూపీఎస్ వల్ల ఉద్యోగులకు ఎంత మేరకు మేలు జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఓల్డ్ పెన్షన్ పథకం కింద ఉద్యోగులకి సామాజిక ఆర్థిక భద్రత లభించేది. పాత పెన్షన్ పరిధిలోని ఉద్యోగికి రిటైర్మెంట్ సమయంలో 50% పెన్షన్, ఒకవేళ ఉద్యోగి మరణిస్తే కుటుంబసభ్యులకి 30% ఫ్యామిలీ పెన్షన్, నిర్ణీత గ్రాట్యుటీ, కమ్యూటేషన్ వంటి అదనపు సౌకర్యాలు ఉండేవి. 2004లో ఎన్డీయే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నూతన పెన్షన్ స్కీమ్ ప్రవేశ పెట్టింది. 2004 జనవరి 1 తర్వాత నియమితులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌ను వర్తింపజేస్తూ అప్పటి భారత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త పింఛన్ పథకాన్ని దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అన్వయించుకొని వారి ఉద్యోగులకు అమలు చేయడం ప్రారంభించాయి.

సీపీఎస్ పెన్షన్ విధానం..

సీపీఎస్ ఉద్యోగి తన బేసిక్ పే (మూలవేతనం) డీఏ (కరువు భత్యం)లో కలిపి 10% మ్యాచింగ్ గ్రాంట్‌గా, ప్రభుత్వం నుంచి మరో 10,% సొమ్మును నేషనల్ పెన్షన్స్ స్కీం ట్రస్ట్‌లో జమ చేస్తారు. ఉద్యోగికి కేటాయించిన పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్లో (ప్రాన్) ఈ మొత్తం సొమ్ము జమ అవుతుంది. ఉద్యోగి పదవీ విరమణ పొందే వరకు జమైన మొత్తం సొమ్ము నుండి 60% డబ్బును మాత్రమే ఉద్యోగికి నగదుగా చెల్లిస్తారు. మిగతా 40% డబ్బును భారతీయ స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా పెడతారు. దానిపై వచ్చే లాభాన్ని నెలవారి పెన్షన్ కింద రిటైర్డ్ ఉద్యోగికి చెల్లిస్తారు. సీపీఎస్ ఉద్యోగి సొమ్మును తీవ్ర ఒడిదుడుకులతో కూడిన స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టడం వల్ల ఉద్యోగి సొమ్ముకి ఆర్థిక భద్రత లోపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులుగా వారి జీవితాంతం ప్రజలకు సేవ చేసి పదవీ విరమణ పొందిన అనంతరం ఉద్యోగుల కుటుంబాల కనీస అవసరాలకి సరిపోయే డబ్బులు పెన్షన్ రూపకంగా అందకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఉద్యోగుల కుటుంబాలు సామాజిక ఆర్థిక భద్రత కరువై వీధుల్లో పడ్డాయి. ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాలకి సీపీఎస్ గుదిబండగా మారింది.

కొన్ని రాష్ట్రాలు ఓపీఎస్‌ను పునరుద్ధరించడంతో..

నూతన పెన్షన్ విధానాన్ని రూపొందించి అమలు చేసుకున్నప్పటి నుండి దేశవ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు పోరాటాలు ప్రారంభించాయి. ఉద్యోగుల ఆకాంక్షలను గుర్తించిన కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో సీపీఎస్ రద్దు అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించి ఎన్నికల్లో విజయం సాధించాక రాజస్థాన్, చత్తీస్‌ఘడ్, జార్ఖండ్, హిమాచల్‌ ప్రదేశ్, పంజాబ్, రాష్ట్రాల్లోని బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించడం ప్రారంభించాయి. దీనివల్ల మిగతా రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెరగడం, కేంద్ర ప్రభుత్వంపై కూడా ఒత్తిడి పెరిగింది. దీంతో గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం సీపీఎస్‌ను రద్దు చేయడం సాధ్యం కాదని, దాని స్థానంలో ఉద్యోగుల సంక్షేమం కోసం మేలైన పథకాన్ని తీసుకొస్తామని పార్లమెంట్లో ప్రక టించి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. సుదీర్ఘ సమీక్షల అనంతరం ఎన్‌‌పీఎస్‌లో చేయాల్సిన మార్పులపై యుూపీఎస్‌ను సూచిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సోమనాథన్ కమిటీ సిఫారసు చేసింది. ఇటీవల కేంద్ర క్యాబినెట్ యూనిఫైడ్ పెన్షన్ స్కీంను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ యూపీఎస్ 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. యూపీఎస్‌లో ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా చేరితే అదనపు భారాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది.

యూనిఫైడ్ పెన్షన్ స్కీం

ఉద్యోగి పదవీ విరమణకు ముందు 12 నెలల్లో అందుకున్న మూలవేతన సగటులో 50% పెన్షన్ అందుతుంది. ఈ పెన్షన్‌కు కనీస సర్వీసు 25 ఏళ్లు ఉండాలి. పెన్షన్‌దారుడు మరణించాక వారి భాగస్వామికి 60% పెన్షన్ అందే అవకాశం ఉంది. ఉద్యోగికి అందించే కనీస పెన్షన్ 10000‌కు అర్హత సాధించాలంటే కనీస సర్వీస్ పది ఏండ్లు ఉండాలి. యుపీఎస్‌లో ప్రభుత్వ వాటా 14.5% నుంచి 18% పెరుగుతుంది. పాత పింఛను పథకంతో పోల్చుకుంటే ఈ యూపీఎస్‌లో ఎంప్లాయ్ కంట్రిబ్యూషన్ అదనంగా ఉంది. సొమ్ము షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వల్ల భద్రత లేదు, పెన్షన్‌పై పీఆర్సీ అమలు లేకపోవడం భవిష్యత్‌లో ఉద్యోగికి వచ్చే పెన్షన్‌లో పెరుగుదల ఉండదు. ఉద్యోగుల సొమ్ము స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి మ్యూచువల్ ఫండ్‌ల ద్వారా కార్పొరేట్లకు లాభార్జన చేకూరేలా చేస్తూ ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు నూతన ఒరవడిలో ఉద్యోగులు పోరాటాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఓపీఎస్ ద్వారా మాత్రమే ఉద్యోగులకు సామాజిక ఆర్థిక భద్రత కలుగుతుంది. ఓపీఎస్ సాధించే వరకు పోరాటాలు చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఉంది. ప్రజల సంక్షేమం కోసం సంక్షేమ పథకాల అమలు చేస్తున్న పాలకులు, ఉద్యోగుల సామాజిక ఆర్థిక భద్రత కోసం ఓపిఎస్ అమలు చేయాలని గ్రహించాలి.

పాకాల శంకర్ గౌడ్

98483 77734

Advertisement

Next Story