దామగుండం అడవిని కాపాడుకుందాం!

by Ravi |
దామగుండం అడవిని కాపాడుకుందాం!
X

దేశ రెండవ రాజధానిగా కీర్తించబడుతున్న హైదరాబాద్ ప్రజలు భుజాలకు ఆక్సిజన్ సిలిండర్లను తగిలించుకుని తిరగవలసిరావడం అనివార్యమేనా? రెండు దశాబ్దాల క్రితం వరకు మంచినీళ్లు బాటిళ్లలో కొనుక్కొని తాగుతామని అనుకున్నామా? కానీ నిజమైంది కదా . ఇప్పుడు మౌనం వహిస్తే మాత్రం త్వరలో ఆక్సిజన్ కోసం, సిలిండర్ గాలి పీల్చుకోవడమే.

వేగంగా విస్తరిస్తున్న జంట నగరాల పరిస్థితి అలాగే ఉండబోతుంది. అభివృద్ధి పేరిట ఏర్పాటు అవుతున్న పరిశ్రమలు, ఆధునీకరణలతో హైదరాబాద్ కాలుష్య కాసారం అవుతుంది. అడవుల ధ్వంసం, రింగ్ రోడ్లు, ఫిలింసిటీ‌లు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఇందులో భాగమే. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 2030 నాటికి హైదరాబాద్ ప్రజలు పూర్తిగా మాస్కులతోనే తిరగ వలసి ఉంటుందన్నది నిష్టూర సత్యం.

అడవులు కాంక్రీట్ జంగిల్స్ అయితే..

హైదరాబాద్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ 3000 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీనిలో 2900 ఎకరాల ఫారెస్ట్‌ను లోఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు ఇండియన్ నేవీకి గత రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీనిలో రాడార్ యాంటెన్నా పార్క్‌తో పాటు, టౌన్‌షిప్‌ని అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ఇదే జరిగితే రియల్ ఎస్టేట్ రాబందులు వాలి మరింత ధ్వంసానికి పాల్పడతాయి. దీంతో దీనికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి హిల్స్ కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇప్పుడు పర్యాటక కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతం, త్వరలో కాంక్రీట్ జంగల్‌గా మారుతుంది. దీనివల్ల 20 గ్రామాలు, 60వేల అమాయక ప్రజల జీవితాలు అగమ్య గోచరమవుతాయి. దీనిపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉంది.

12 లక్షల చెట్లు... మన ఊపిరితిత్తులు

గతంలో తిరునల్వేలిలో నిర్మించిన కట్ట బొమ్మన్ రాడార్ స్టేషన్‌తో ప్రజలకు ఇబ్బంది కలగనందున ఎలాంటి వ్యతిరేకత రాలేదు. దీనికంటే 100 రేట్లు శక్తివంతమైన రాడార్ స్టేషన్‌ను ఇక్కడ నిర్మించాలనుకుంటున్నారు. జరగబోయే నష్టం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడం కష్టం. ఈ రిజర్వ్ ఫారెస్ట్ 12 లక్షల పచ్చని చెట్లతో విస్తరించి, రాష్ట్ర రాజధాని ప్రజానీకంతో పాటు, పరిసర జిల్లాలకు ఆక్సిజన్ అందిస్తున్నది. ఇంకొక రకంగా చెప్పాలంటే ఊపిరితిత్తులా ఉపయోగపడుతుంది. నిజానికి ఈ రిజర్వ్ ఫారెస్ట్ భూమి అటు ప్రభుత్వానికి కానీ, ఇటు అటవీ శాఖకు కానీ చెందినది కాదు. రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయ భూములు. దీనిని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అన్యా క్రాంతం చేసి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడచూసిందని అందరికీ అర్థం అయింది.

హైడ్రా అక్కడా కన్నేయాలి!

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. దేశంలోని కాలుష్య నగరాలలో ఢిల్లీ ప్రథమ స్థానంలో ఉండగా, హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. డబ్లూహెచ్‌ఓ నివేదిక ప్రకారం గాలి కాలుష్యం రేటు 1.7 రేట్లు అధికంగా ఉంది. దీనివల్ల భూతాపం కూడా పెరిగింది. ప్రస్తుత ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళన కోసం లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామంటుంది. చెరువుల దురాక్రమణకు వ్యతిరేకంగా హైడ్రాను తీసుకొచ్చింది. గత ప్రభుత్వం హరితహారం, వన మహోత్సవం నినాదాలతో హోరెత్తించింది. ఇలా ప్రభుత్వాలు పర్యావరణాన్ని కాపాడుతామంటూనే అడవుల ధ్వంసానికి అనుమతిస్తూ గత పాలకులు ద్వంద నీతి పాటిం చడం పరమ అభ్యంతరకరం. రామోజీ ఫిలింసిటీకి వందల ఎకరాల రాచకొండ అటవీ భూములను కట్టబెట్టి నాశనం చేయ చూశారు. ఫార్మాసిటీ పేరిట వందలాది ఎకరాల భూములు కాలుష్యం కానున్నాయి. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన 100 ఎకరాల భూమిని హైకోర్టు కొత్త భవనానికి కేటాయించి శంకుస్థాపన చేశారు. పట్టణీకరణ కారణంగా, రియల్ ఎస్టేట్ వ్యాపారుల దాహార్తికి ఇప్పటికే వేలాది ఎకరాలు సిమెంట్ కమ్యూనిటీలుగా మారాయి. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఈ ప్రమాదం బారిన పడతాయి. ఈ కారణంగా నిర్వాసితుల సమస్య కూడా తలెత్తుతుంది.

నదుల అంతర్ధానం తప్పదు!

అటవీ భూముల ఆక్రమణలతో నిర్మిస్తున్న భారీ ప్రాజెక్టులు, మైనింగ్, గుట్టల తవ్వకాల అనుమతులతో పర్యావరణ కాలుష్యం, వలన ఏర్పడిన నిర్వాసిత్వ సమస్యలు పరిష్కారం కావడం లేదు. దామగుండం రిజర్వ్ ఫారెస్టును రాడార్ స్టేషన్‌కు అప్పగిస్తే మూసీ నది జన్మస్థలం అంతర్దానం అయ్యే ప్రమాదం ఉంది. చత్తీస్‌గఢ్ అడవిలో అదానీ ప్రాజెక్టు పూర్తయితే, హస్డియో నది కనుమరుగవుతుంది. పోలవరం, కాళే శ్వరం ప్రాజెక్టుల నిర్మాణంతో లక్షలాది ఆదివాసీలు నిర్వాసితులయ్యారు. శబరి నది ఉనికిలో లేకుండా పోతుంది. ప్రజలు ఈ విధ్వంసానికి వ్యతిరేకంగా శతాబ్దాలుగా పోరాడుతూనే ఉన్నారు. పర్యావరణ హిత ప్రాజెక్టులకు మాత్రమే అనుమతిచ్చేలా తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్తగా అడుగులేయాలి.

చిప్కో ఉద్యమం స్ఫూర్తిగా...

పాలకుల అనాలోచిత నిర్ణయాలు కార్పొరేట్ శక్తులకు సంపదను చేకూరుస్తున్నాయి. ప్రజల జీవితాలను ఆగం చేస్తున్నాయి. ఇప్పుడైనా పర్యావరణవేత్తలు, బుద్ధి జీవులు, న్యాయవాదులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు, పౌర ప్రజాస్వామిక వాదులు కలిసికట్టుగా ఉద్యమిస్తే తప్ప ఈ విధ్వంసాన్ని అడ్డుకోవడం సాధ్యపడదు. ఈ విధ్వంసక అభివృద్ధికి వ్యతిరేకంగా నోరు విప్పకపోతే భవిష్యత్ తరాలు తీవ్ర ప్రమాదంలో పడడం ఖాయం. కనీసం తరాల మనుగడ కోసమైనా పోరాటాలకు నడుం కట్టి ముందుకు కదలడం అనివార్యం. కేవలం 300 చెట్ల పరిరక్షణ కోసం జరిగిన చిప్కో ఉద్యమాన్ని గుర్తు చేసుకోవడం, స్ఫూర్తి పొందడం ఈ సందర్భంలో ఎంతైనా అవసరం. రాజకీయాలకతీతంగా పాలకులను ఎక్కడికక్కడ నిలదీసి ప్రశ్నించే చైతన్యం కొరవడితే భవిష్యత్తు అంధకారం అవుతుంది. ప్రజలారా! పారాహుషార్!!

రమణా చారి

99898 63039

Next Story

Most Viewed