విపక్షాల పైనే ఏజెన్సీల దాడి!

by Ravi |   ( Updated:2023-02-24 01:43:07.0  )
విపక్షాల పైనే ఏజెన్సీల దాడి!
X

బీజేపీలో చేరండి, లేదా బీజేపీ జోలికి రావద్దు, అలా అయితే, ఎన్ని కేసులు ఉన్నా, అన్నీ మాఫీ. మీ జోలికి ఈడీ, సీబీఐ, ఐటీ ఎవరూ రారు. ఇదీ ప్రస్తుతం దేశంలో బీజేపీ ఏకఛత్రాధిపత్య పాలన విపక్షాల కు ఇచ్చే సంకేతం! బీజేపీ పాలనలో ఈడీ నిష్పక్షపాతం మీద అతి సామాన్యులకు కూడా అనుమానాలు కలుగుతున్నాయి. స్వతంత్రంగా ఉండాల్సిన ఏజెన్సీలు అన్నీ బీజేపీ పాలనలో రాజకీయమయం అయిపోయాయి. ప్రభుత్వంలో ఉన్న వారి చేతుల్లో కీలుబొమ్మలు అయిపోయాయి అంటే అతిశయోక్తి కాదు. మొత్తంగా పొలిటికల్ ఫండింగ్ కూడా విపక్షాలకు దొరకకుండా బీజేపీ వారిని ఏదో ఒక బూచి, భయం నడుమ ఉంచేస్తున్నది.

దేశంలో పార్లమెంట్ ఎన్నికలు 2024లో జరగనున్నాయి. ఈ ఏడాది చివరి వరకు 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విపక్షాలను బలహీనం చేసేందుకు బీజేపీ పార్టీ కేంద్రీకరించినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే రాజకీయ విరాళాలు విపక్షాలకు దొరకకుండా కార్పొరేట్‌లను అడ్డుకోవడం మొదలు పెట్టింది. పక్కకు పెట్టిన ఈడీ, ఐటీ, సీబీఐ, తదితర కేసులను మళ్ళీ తెరమీదికి తెస్తున్నారు. కొందరి మీద రైడ్స్, సర్వేలు చేస్తున్నారు. తాజాగా ఛత్తిస్‌గడ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీతో సంబంధం ఉన్నవారికి సంబంధించిన 14 కేంద్రాల్లో ఈడీ దాడులు జరిపింది. ఈ నెల 24 నుంచి కాంగ్రెస్ జాతీయ స్థాయి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, మద్దతు దారులను భయభ్రాంతులను చేయడానికి ఈడీ దాడులను ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు, పార్టీ, ఇలాంటి బెదిరింపులకు లొంగబోదని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నారు. 52 కోట్ల బొగ్గు స్కాంకు సంబంధించి ఆరోపణల మీద ఈడీ సోదాలు చేసింది. కొంత మంది అధికారులను కూడా అరెస్ట్ చేసారు.

పార్టీలో చేరితే కేసులు హాంఫట్

నిజానికి గతంలో కాంగ్రెస్ నేత, ప్రస్తుత అసోమ్ సీఎం హేమంత్ బిస్వాస్ మీద ఈడీ రైడ్స్ జరిగాయి. కేసులు పెట్టారు.. ఆయన బీజేపీలో చేరి, సీఎం అయ్యారు. అంతే... ఆయన మీద కేసులు ఏమయ్యాయో తెలియదు. బెంగాల్‌లో సువెందు అధికారి పైన శారదా కేసులు పెట్టారు. అతను టీఎంసీ నుంచి బీజేపీలో చేరడంతో కేసులు ఏమయ్యాయో తెలియదు కానీ, తర్వాత ఆయన బీజేపీలో పెద్ద నాయకుడు అయ్యాడు. ఇదీ బీజేపీ పరిస్థితి, దేశ ద్రోహం కేసు మోపబడిన గుజరాత్ నేత హార్దిక్ పటేల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరగానే కేసు ఏమైందో తెలియదు. దేశంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది. ముకుల్ రాయ్, మాజీ సీఎంలు యడ్యూరప్ప, నారాయణ్ రాణే, రెడ్డి బ్రదర్స్‌ల పరిస్థితి ఇదే! అటు మహారాష్ట్రలోని సీఎం ఏక్ నాథ్ షిండే గ్రూప్‌కు చెందిన 12 మంది ఎమ్మెల్యేల మీదనైతే ఈడీ, సిబిఐ కేసులకు సంబంధించి చాలా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అయితే మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని బీజేపీ సహాయంతో పడగొట్టగానే, ఆ 12 మంది మీద, సీఎం షిండే మీద కేసులు ఏమయ్యాయో తెలియదు.

బీజేపీలో చేరండి, లేదా బీజేపీ జోలికి రావద్దు, అలా అయితే, ఎన్ని కేసులు ఉన్నా, అన్నీ మాఫీ, మీ జోలికి ఈడీ, సీబీఐ, ఐటీ ఎవరూ రారు. ఇదీ ప్రస్తుతం దేశంలో బీజేపీ ఏకఛత్రాధిపత్య పాలన విపక్షాలకు ఇచ్చే సంకేతం! బీజేపీ పాలనలో ఈడీ నిష్పక్షపాతం మీద అతి సామాన్యులకు కూడా అనుమానాలు కలుగుతున్నాయి. జర్నలిస్ట్ సిద్ధిక్ కప్పన్ మీద సైతం ఈడీ కేసు పెట్టడంతో ఈ అనుమానాలు ఇంకా బలపడుతున్నాయి. మొత్తంగా బీజేపీ పాలనలో స్వతంత్రంగా ఉండాల్సిన ఏజెన్సీలు అన్నీ రాజకీయమయం అయిపోయాయి. ప్రభుత్వంలో ఉన్న వారి చేతుల్లో కీలు బొమ్మలు అయిపోయాయి, అంటే అతిశయోక్తి కాదు. దేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కాలంలో 2004 నుంచి 2014 వరకు 112 ఈడీ కేసులు నమోదు అయితే 2014 తర్వాత గత ఎనిమిదిన్నర ఏళ్ల మోడీ పాలనలో 3,010 ఈడీ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 85 శాతం విపక్షాల వారి మీదనే కేసులు నమోదు అయిన దాఖలాలు ఉన్నాయి. దేశంలో 125 మంది పొలిటిషియన్స్ మీద ఇటీవల ఈడీ కేసులు పెడితే, ఇందులో 109 మంది విపక్షాల నేతలే ఉన్నారు.

ఐటీ, ఈడీ కేసుల్లో పక్షపాతం

ఒకసారి ఐటీ కేసులను పరిశీలిస్తే మొత్తం 4,000 ఐటీ కేసులకు సంబంధించి నోటీసులు ఇచ్చారు. అందులో 3,425 మంది విపక్షాల వారే ఉన్నారు. 679 సీబీఐ కేసులు నమోదు అయితే, అందులో 629 ఘటనల్లో విపక్షాల మీదే కేసులు పెట్టారు. ఛత్తీస్‌గఢ్ లో బీజేపీ మాజీ సీఎం రమణ్ కుమార్ మీద వెయ్యి కోట్ల బొగ్గు స్కాం ఆరోపణలు ఉన్నాయి. అయితే దాని మీద ఈడీ నేటికీ మౌనంగానే ఉంది. మహారాష్ట్రలో 15 ఈడీ, 415 ఐటీ, బెంగాల్‌లో 27 ఈడీ, 58 సీబీఐ,115 ఐటీ కేసులు మోపారు. బీహార్‌లో ఐటీ కేసులు 290, సీబీఐ 48 కేసులు, యూపీలో 490 ఐటీ,37 సీబీఐ, తెలంగాణాలో 19 ఈడీ, 940 ఐటీ, 69 సీబీఐ, రాజస్థాన్‌లో 1112 ఐటీ, 86 సీబీఐ,16 ఈడీ కేసులు, పంజాబ్‌లో ఈడీ కేసులు 21, ఐటీ కేసులు 908, సీబీఐ కేసులు 51 నమోదు అయ్యాయి. ఇందులో చాలా మందికి నోటీసులు జారీ చేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది.

2014 వరకు ఈడీ, ఐటీ, సీబీఐ కేసులలో 102 మంది బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే వారి మీద విచారణ ఆగి ఉంది. ఆ కేసులు ఏమయ్యాయో తెలియదు. ఇండస్ట్రీస్, దేశంలో విపక్షాల ప్రభుత్వాలు ఉన్న చోట విపక్షాలకు కాస్తోకూస్తో ఫండ్స్ ఇచ్చే కాస్త డబ్బున్న పెట్టుబడి దారులు 5,956 మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మీద కూడా గురి పెట్టారు. మొత్తంగా పొలిటికల్ ఫండింగ్ కూడా వారికి దొరకకుండా ఇప్పుడు బీజేపీ విపక్షాలను ఏదో ఒక బూచి, భయం నడుమ ఉంచేస్తున్నది. ఎలాగైనా, ఏ ఎన్నికైన గెలవాలి, అనే ఒకే ఒక లక్ష్యంతో పీఎం నరేంద్ర మోడీ ఉన్నారు.

ఎండి. మునీర్

సీనియర్ జర్నలిస్ట్

9951865223

Also Read...

YCP vs BJP: బతుకు బీజేపీలో... బత్తెం వైసీపీలో!


Advertisement

Next Story

Most Viewed