మీడియా పేరుతో డబ్బులు వసూలు

by Sridhar Babu |   ( Updated:2024-09-11 12:07:25.0  )
మీడియా పేరుతో డబ్బులు వసూలు
X

దిశ, వేములవాడ : తాను ప్రింట్ అండ్​ ఎలక్ట్రానిక్ మీడియాల్లో పనిచేస్తున్నానని చెబుతూ వేములవాడ పరిసర ప్రాంతాలకు చెందిన యువకులకు మోసపూరితమైన మాటలు చెప్పి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసిన మహిళను, సహకరించిన మరో వ్యక్తిని చందుర్తి పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు బుధవారం వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి కేసు వివరాలను తెలిపారు. వేములవాడ అర్బన్ మండలం చింతల్ ఠాణా ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన చొక్కారపు వనజ అనే మహిళ తాను రిపోర్టర్ గా పని చేస్తున్నానని, ఇంకా ఎవరైనా రిపోర్టర్లుగా మారాలంటే తాను ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అక్రిడిటేషన్ కార్డులు ఇప్పించింది.

ఈ అక్రిడేషన్ కార్డుతో ప్రభుత్వం నుండి వచ్చే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇండ్ల ప్లాట్లు ప్రభుత్వానికి సంబంధించిన అసైన్డు భూములు ఇప్పిస్తానని చెప్పి 2019 లో చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన రొండి చంద్రయ్య వద్ద నుండి దాదాపు రూ.16 లక్షలు తీసుకొని మోసం చేసింది. రామన్నపేట గ్రామానికి చెందిన పేద రైతు ఆరుట్ల ఆది మల్లయ్యకు మూడు ఎకరాల వ్యవసాయ భూమిని తంగళ్లపల్లి మండలంలోని సారంపల్లి గ్రామ శివారులో ఇప్పిస్తానని చెప్పి నమ్మించి దాదాపు రూ. 10 లక్షల తీసుకొని మోసం చేసింది. ఈ క్రమంలో మోసపోయిన బాధితుల ఫిర్యాదు మేరకు చందుర్తి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి నిందితురాలిని, ఆమెకు సహకరించిన మాల్యాల గ్రామానికి చెందిన పీసరి శ్రీనివాస్ ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు తెలిపారు. ఇంకా చొక్కాల వనజ చేతిలో మోసపోయిన బాధితులు ఎవరైనా ఉంటే సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని, బాధితులకు అండగా ఉండి పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed