పెళ్లికి నిరాకరించిన పెద్దలు.. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ప్రేమ జంట.. చివరికి ఏమైందంటే?

by Jakkula Mamatha |   ( Updated:2024-10-18 06:20:56.0  )
పెళ్లికి నిరాకరించిన పెద్దలు.. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ప్రేమ జంట.. చివరికి ఏమైందంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ప్రేమజంట ఆత్మహత్య కలకలం రేపింది. గుంటూరు జిల్లాలో ఓ ప్రేమజంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. మృతులను పెదకాకాని గ్రామానికి చెందిన దానబోయిన మహేశ్ (22), నందిగామ మండలం రుద్రవరానికి చెందిన నండ్రు శైలజ (21)లుగా గుర్తించారు. డిప్లొమా పూర్తిచేసిన మహేశ్ రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లోని ఓ మొబైల్ స్టోర్‌లో ఉద్యోగం చేశాడు. ఆ సమయంలో అక్కడే పనిచేస్తున్న శైలజతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరి ప్రేమ విషయం తెలిసిన యువకుడి కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకున్నారు. కానీ యువతి కుటుంబ సభ్యులు మాత్రం పెళ్లికి నిరాకరించారు.

దీంతో ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని నిశ్చయించుకున్న ఆ ప్రేమికులు దసరా సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లారు. అయితే గత వారం ఇంట్లో నుంచి వెళ్లిన ఆ ప్రేమ జంట ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారనే విషయాలు తెలియరాలేదు. ఆ తర్వాత మహేశ్, శైలజ కనిపించకపోవడంతో శైలజ కుటుంబ సభ్యులు గాలించారు. ఈ క్రమంలో ఈ రోజు(శుక్రవారం) వేకువజామున పెదకాకాని సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఇద్దరూ విగత జీవులుగా కనిపించారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed