- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
దాహం వేస్తుందంటే జాలి చూపింది.. కానీ తర్వాత ఏమైందంటే..

దిశ, కూకట్పల్లి : ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళను మంచి నీళ్లు అడిగి ఆమె మెడలో నుంచి బంగారు మంగళసూత్రాన్ని లాక్కుని పరారైన దొంగను కేపీహెచ్బీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ సురేష్ కుమార్, ఏసీపీ శ్రీనివాస్ రావు, సీఐ రాజశేఖర్ రెడ్డిలతో కలిసి వివరాలు వెల్లడించారు. కేపీహెచ్బీ కాలనీ ఈడబ్ల్యూఎస్ 998లో నివాసం ఉంటున్న మహిళ 12వ తేదీ తెల్లవారుజామున ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా ఓ వ్యక్తి దాహం వేస్తుంది తాగడానికి నీళ్లు కావాలని అడిగాడు. సదరు మహిళ ఇంట్లోకి వెళ్లి నీళ్ల బాటిల్ తీసుకు వస్తుండగా ఆమె మెడలో నుంచి బంగారు పుస్తెల తాడు లాక్కుని పరారయ్యాడు. దీంతో బాధితురాలు కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన కేపీహెచ్బీ పోలీసులు సీసీ కెమెరాలలో నమోదైన పుటేజీ ఆధారంగా నిందితుడిని అదుపులో తీసుకున్నారు.
నిందితుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఉప్పు సాయి తేజ(26)గా గుర్తించారు. రాపిడో డ్రైవర్గా పని చేస్తున్న సాయి తేజ విలాసాలకు అలవాటు పడి చోరీలను ప్రవృత్తిగా మార్చుకున్నాడు. ఈ క్రమంలో కేపీహెచ్బీ కాలనీ టెంపుల్ బస్టాప్ వద్ద రోడ్డుపై సంచరిస్తూ ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళను గమనించి ఆమెను దాహం వేస్తుంది నీళ్లు ఇవ్వమని అడిగాడు. మానవతా దృక్పథంతో నీళ్లు ఇచ్చేందుకు ఇంటిలోకి వెళ్లిన మహిళ వెంట ఇంటి లోపలికి ప్రవేశించి మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడును లాగాడు. దీంతో మహిళ ప్రతిఘటించడంతో గొలుసు తెగి ఓ ముక్క సాయితేజ చేతిలోకి వచ్చింది. వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. సాయి తేజ నుంచి మొబైల్ ఫోన్, బైక్, బంగారు గొలుసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించినందుకు డీసీపీ సురేష్ కుమార్, ఏసీపీ శ్రీనివాస్ రావులు సీఐ రాజశేఖర్ రెడ్డి, డీఐ కె. రవి కుమార్, డీఎస్సై అబ్దుల్ సమద్, క్రైం సిబ్బంది ఎలాయాపాల్, ఆనంద్ రెడ్డి, రఘురాంలను అభినందించారు.