కేరళలో దారుణం.. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం..

by Vinod kumar |
కేరళలో దారుణం.. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం..
X

తిరువనంతపురం: కేరళలోని కొచ్చిలో అమానుషం జరిగింది. ఓ వ్యక్తి జ్యూస్ కొనిస్తానని ఆశ చూపి.. ఐదేళ్ల బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం గొంతు నులిమి ఆ పాపను కడతేర్చాడు. చిన్నారి మృతదేహాన్ని గోనె సంచిలో వేసి చెత్తకుప్పల్లో పడేశాడు. శుక్రవారం సాయంత్రం నుంచి బాలిక కనిపించలేదు. దీంతో స్థానికంగా వెతికిన కుటుంబసభ్యులు చివరకు పోలీసులను ఆశ్రయించారు. గాలింపు చేపట్టిన పోలీసులు.. చెత్త డంపింగ్ యార్డులో పడేసి ఉన్న గోనె సంచిలో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే పోస్టుమార్టం కోసం డెడ్‌ బాడీని ఆస్పత్రికి తరలించారు.

ఇంతటి దారుణానికి తెగబడిన కామాంధుడు బాలిక ఉన్న భవనంలోనే అద్దెకు నివసించేవాడని పోలీసు దర్యాప్తులో తేలింది. బాగా మద్యం తాగిన తర్వాత అతడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని వెల్లడైంది. ఆ బిల్డింగ్‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. ఆ వ్యక్తి పేరు అష్ఫాక్ అస్లం అని, బీహార్‌కు చెందిన అతడు కూలీ పనుల కోసం కేరళకు వలస వచ్చాడని గుర్తించారు.

అతడు పాపను కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. దీంతో శనివారం రాత్రి 9.30 గంటలకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అతడు స్పృహలో లేడు. బాగా తాగి ఉన్నందున పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదు. అతడు స్పృహలోకి వచ్చాక.. ఇన్వెస్టిగేట్ చేస్తే జరిగిందంతా చెప్పాడు. ఆదివారం ఉదయం నేరం అంగీకరించాడు. అయితే బాధిత బాలిక కుటుంబం కూడా బీహార్ నుంచే వలస వచ్చి కేరళలో నివసిస్తోంది.

నిందితుడిని కోర్టులో హాజరుపర్చి రిమాండుకు తరలించిన పోలీసులు.. తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో బాధిత బాలికకు క్షమాపణలు చెప్పారు. ‘సారీ డాటర్‌, నిన్ను నీ తల్లిదండ్రులకు ప్రాణాలతో అప్పగించడంలో మేం విఫలమయ్యాం’ అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. మలయాళంలో చేసిన ఈ ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కూతురి మరణవార్త తెలిసినప్పటి నుంచి ఆ చిన్నారి పేరెంట్స్ గుండెలవిసేలా రోదిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed