కొడుకు పుట్టిన కొద్ది సేపటికే భర్త ఆత్మహత్య..

by Sumithra |
కొడుకు పుట్టిన కొద్ది సేపటికే భర్త ఆత్మహత్య..
X

దిశ, భిక్కనూరు : కొడుకు పుట్టిన సంతోషం.. కొద్దిసేపే మిగిలింది. కొడుకును చూసుకుంటూ సంతోష పడుతున్న సమయంలో భార్యాభర్తల మధ్య ఏదో చిన్న విషయమై గొడవ జరగడంతో మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన భిక్కనూరు మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పట్టణానికి చెందిన చిగుళ్ల మధు (25) గొర్రెలు కాయడంతో పాటు, డైలీ లేబర్ గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రెండేళ్ల క్రితం పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన కృష్ణవేణిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆదివారం కామారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో తన భార్య డెలివరీ అయ్యి పండంటి కొడుకుకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలియడంతో ఉబ్బి తబ్బిబ్బైన భర్త మధు సాయంత్రం కామారెడ్డిలోని ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ పుట్టిన కొడుకుని చూసుకొని సంతోషపడ్డాడు.

ఇంతలో భార్య భర్తల మధ్య ఖర్చుల విషయమై గొడవ జరిగింది. ఇరువురి మధ్య మాట మాట పెరగడంతో, అప్పుడే పుట్టిన కొడుకును తీసుకెళ్తానంటూ భార్యతో గొడవ పెట్టుకున్నాడు. భార్యతో పాటు అక్కడి వైద్య సిబ్బంది వద్దని వారించినందుకు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. రాత్రి ఇంటికి చేరుకొని ఇంట్లో ఉన్న తమ్మునితో నిద్రకు ఉపక్రమించాడు. మధ్యలో లేచి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లారి తన సోదరుడు చూసేసరికి దూలానికి వేలాడుతుండడంతో చుట్టుపక్కల వారికి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతునికి భార్యతో పాటు, తండ్రి బీరయ్య, తల్లి లక్ష్మి, సోదరుడు ఉన్నారు. ఈ మేరకు భిక్కనూరు ఎస్సై (2) రాంచందర్ నాయక్ ఆధ్వర్యంలోని పోలీసులు ఘటన స్థలాన్ని సందర్శించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.

Next Story

Most Viewed