Delhi: ఢిల్లీలో దారుణం.. యూనివర్సిటీ విద్యార్థిని దారుణ హత్య

by Vinod kumar |
Delhi: ఢిల్లీలో దారుణం.. యూనివర్సిటీ విద్యార్థిని దారుణ హత్య
X

న్యూఢిల్లీ : ఢిల్లీలో దారుణం జరిగింది. ఢిల్లీ యూనివర్సిటీలోని కమలా నెహ్రూ కాలేజీకి చెందిన 25 ఏళ్ల విద్యార్థిని శుక్రవారం ఉదయం దారుణ హత్యకు గురైంది. దక్షిణ ఢిల్లీలోని మాల్వియా నగర్‌లో ఉన్న పార్క్‌లో ఆమె శవమై కనిపించింది. ఆ స్టూడెంట్ డెడ్ బాడీ సమీపం నుంచి ఒక ఇనుప రాడ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన విద్యార్థిని తలపై గాయాలు ఉన్నాయి. ఇనుప రాడ్‌తో దాడి చేయడం వల్లే విద్యార్థిని చనిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఢిల్లీ సౌత్ జోన్ డీసీపీ చందన్ చౌదరి తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత స్టూడెంట్ తన స్నేహితుడితో కలిసి అరబిందో కాలేజీ సమీపంలోని పార్కుకు వచ్చింది. అయితే ఇద్దరి మధ్య దేనిపై గొడవ జరిగిందో ఏమో.. స్నేహితుడు అక్కడున్న ఇనుప రాడ్‌ తీసుకొని తలపై బలంగా మోదాడు. దీంతో ఆ విద్యార్థిని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆ వెంటనే హత్య చేసిన వ్యక్తి పరారయ్యాడు.

కాగా, ఢిల్లీలో గత 24 గంటల్లో ఇద్దరు మహిళలు హత్యకు గురైన నేపథ్యంలో ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ఘాటుగా స్పందించారు. స్థానిక మహిళల భద్రతపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. “ఢిల్లీలో ఒకచోట మహిళను కాల్చి చంపారు. మరోచోట ఒక అమ్మాయిని రాడ్‌తో కొట్టి చంపారు. 24 గంటల్లోనే ఈ రెండు ఘోరాలు జరిగాయి. ఇవన్నీ జరిగాక ఢిల్లీ సురక్షితం అని ఎలా అంటారు. ఢిల్లీలో మహిళల భద్రతపై ఎవరికీ పట్టింపు లేదు. దేశ రాజధానిలో నేరాలు ఆగకపోవడం బాధాకరం” అని స్వాతి మలివాల్ పేర్కొన్నారు.

Advertisement

Next Story