మంత్రాల నెపంతో మహిళపై దాడి…పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు

by Kalyani |
మంత్రాల నెపంతో మహిళపై దాడి…పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు
X

దిశ, నిజాంపేట: మంత్రాలు చేస్తూ అనారోగ్యానికి గురి చేస్తుందని ఆరోపిస్తూ ఓ మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన డేగల ముత్తవ్వ (45) అనే మహిళ మంత్రాలు చేస్తూ గ్రామంలో కొంతమందిని అనారోగ్యానికి గురి చేస్తుందని భావించి అనారోగ్యానికి గురైన కుటుంబీకులు, బంధువులు గురువారం రాత్రి ఆమె ఇంటి వద్దకు వచ్చి దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. అది గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే మంటలను ఆర్పి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న రామాయంపేట పోలీసులు మహిళను చికిత్స నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

శుక్రవారం మహిళ చికిత్స పొందుతూ మృతి చెందడంతో ముత్తవ్వ భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు. దాడికి బాధ్యులైన వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించడం జరుగుతుందన్నారు. ప్రజల్లో చైతన్యం పెంచడం కోసం పోలీస్ కళాబృందం ప్రతిరోజు గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ప్రజల్లో చైతన్యం కలగడం లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు మూఢనమ్మకాలను నమ్మవద్దని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకట్ రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరాజ గౌడ్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Next Story

Most Viewed