మంచి కాలేజీలో సీటు వస్తదో రాదోనని విద్యార్థి ఆత్మహత్య

by Sridhar Babu |
మంచి కాలేజీలో సీటు వస్తదో రాదోనని విద్యార్థి ఆత్మహత్య
X

దిశ,ఉప్పల్ : మంచి కాలేజీలో సీటు వస్తదో రాదోనని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై కోటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం ఉప్పల్ విజయపురి కాలనీలో నివాసం ఉంటున్న పిల్లి దేవరాజ్, నయోమి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు అవినాష్ రాజ్, చిన్న కుమారుడు అరూప్ రాజ్(18). కాగా చిన్న కుమారుడు అరూప్ రాజ్ ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నాడు. ప్రతి రోజులాగే బుధవారం కూడా కోచింగ్ కు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాడు.

తన స్నేహితులతో కలిసి ఫుట్ బాల్ ఆడి ఇంటికి వచ్చి రాత్రి 11.30 ప్రాంతంలో పడుకున్నాడు. గురువారం ఉదయం తల్లి అరూప్ రాజ్ ను నిద్ర లేపడానికి వెళ్లగా చీరతో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అది చూసి తల్లి కేకలు వేయడంతో చుట్టు పక్కల వాళ్లు వచ్చారు. 108 అంబులెన్స్ లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. తనకు మంచి కాలేజీలో సీటు వస్తదో రాదో అని మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకొని ఉంటాడని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed