సుకన్య సమృద్ది యోజన స్కీమ్‌లో కీలక మార్పులు..? ఇక నుంచి వారు మాత్రమే ఖాతా తెరవాలి..!

by Kavitha |
సుకన్య సమృద్ది యోజన స్కీమ్‌లో కీలక మార్పులు..? ఇక నుంచి వారు మాత్రమే ఖాతా తెరవాలి..!
X

దిశ, వెబ్‌డెస్క్: 'బేటీ బచావో బేటీ పడావో' ప్రచారాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం 2015 సంవత్సరంలో సుకన్య సమృద్ధి యోజన (SSY) ను ప్రారంభించింది. ఆడపిల్లల భవిష్యత్ అవసరాల కోసం ఒక నిధిని నిర్మించడం ఈ సుకన్య సమృద్ధి యోజన పథకం లక్ష్యం. ఈ పథకం కింద తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ కుమార్తెల హయ్యర్ స్టడీస్ కోసం, మ్యారేజ్ కోసం డబ్బును డిపాజిట్ చేసే అవకాశం ఉంది. ఇందులో పెట్టుబడి పెట్టిన మొత్తంపై భారీగా వడ్డీని అందిస్తోంది. అయితే 2015నుంచి అనేక మార్పులు చేర్పులతో కొనసాగుతూ వస్తున్న ఈ స్కీమ్‌లో ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైంది. ఈ పథకానికి సంబంధించి కొత్త నిబంధనలను తీసుకురానుంది. ఇవి కూడా వచ్చే నెల నుంచే (అక్టోబర్) అమల్లోకి వస్తాయని సమాచారం. మరి ఇంతకీ ఆ కొత్త నిబంధనలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..

ఇక నుంచి వారు మాత్రమే అకౌంట్ తెరవచ్చు..

సుకన్య సమృద్ధి యోజన పథకంలో భాగంగా కుమార్తెల కోసం అకౌంట్ ఓపెన్ చేయాలంటే వారి తల్లిదండ్రులు గానీ, సంరక్షకులు గానీ అవసరం. కుమార్తెకు తల్లిదండ్రులు చట్టపరమైన సంరక్షలు. కానీ, కుమార్తెకు చట్టపరమైన సంరక్షకులు లేకుంటే.. ఇతర సంరక్షకులు ఆమె పేరిట ఖాతా తెరిచే అవకాశం ఇంతకు ముందు ఉంది. కానీ, ఇప్పటినుంచి అలా కుదరదు. బాలిక పేరిట ఉన్న ఖాతాను చట్టపరమైన సంరక్షకుడి పేరిట బదిలీ చేయాల్సి ఉంటుంది. లేదంటే సదరు ఖాతాను మూసివేయడం జరుగుతుంది. కాగా అక్టోబర్ 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు.

సుకన్య సమృద్ధి యోజన వివరాలు:

ఒక వ్యక్తి తనకు ఆడపిల్ల పుట్టిన వెంటనే ఏదైనా బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్‌లో సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi Yojana) ఖాతాను ప్రారంభించవచ్చు. ఆ ఖాతాలో సంవత్సరానికి రూ. 500 నుంచి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఒక వ్యక్తి Sukanya Samriddhi Yojana ఖాతాలో 15 సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా ఏటా రూ. 1.5 లక్షలను డిపాజిట్ చేస్తే, 15 సంవత్సరాలకు అతడు డిపాజిట్ చేసిన మొత్తం రూ. 22,50,000 అవుతుంది. ఈ స్కీమ్‌లో మెచ్యూరిటీ పీరియడ్ 21 సంవత్సరాలు. 15 సంవత్సరాల తర్వాత డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ, ఆ మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవడానికి 21 ఏళ్లు ఆగాల్సి ఉంటుంది. 21 సంవత్సరాలు ముగిసిన తరువాత ఆ వ్యక్తికి వడ్డీతో కలుపుకుని రూ. 69,32,638 అందుతాయి. అంటే, తన డిపాజిట్ పై ఆ వ్యక్తికి రూ. 46,82,638 ల వడ్డీ లభిస్తుంది.

Advertisement

Next Story