మంత్రి ఇలాకలో రెచ్చిపోతున్న గంజాయి స్మగ్లర్లు

by  |
మంత్రి ఇలాకలో రెచ్చిపోతున్న గంజాయి స్మగ్లర్లు
X

దిశ, బాల్కొండ: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రాతినిథ్యం సొంత నియోజకవర్గం బాల్కొండలో గంజాయి స్మగ్లర్లు రెచ్చి పోతున్నారని బీఎస్పీ నాయకులు సునీల్ కుమార్ ఆరోపించారు. ఆదివారం మెర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో బీఎస్పీ రాష్ట్ర నాయకులు, ఆరేంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ…

గంజాయి తాగి యువత చెడిపోతున్నారని, స్వయాన మంత్రి సమీప బంధువే గంజాయి స్మగ్లర్లను కాపాడుతున్నారని అన్నారు. గంజాయి మూలంగా పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయని ఆవేదన చెందారు. గంజాయిని అరికట్టాలన్నారు. గతంలో పత్రికా ముఖంగా గంజాయి స్మగ్లింగ్‌ను తాను తెరపైకి తెస్తే, దానిని అరికట్టే ప్రయత్నం చేయాల్సింది పోయి ఎదురుదాడికి దిగడం మంచి పరిణామం కాదన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఈ విషయంలో ముందుకు వస్తే ఎక్కడెక్కడ గంజాయి స్మగ్లింగ్ జరుగుతుందో వివరిస్తానని తెలిపారు.

ప్రజలు ప్రజా సమస్యలపై పోరాటం చేయమని తనకు బాధ్యత అప్పజెప్పారని అధికారంలో ఉన్న మీరు సమస్యలను పరిష్కరించకుంటే ప్రజలు పాలకులపైన పెట్టుకున్న నమ్మకానికి సార్థకత ఉండదని తెలిపారు. పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందనే ఆవేదనతోనే ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నట్టు తెలిపారు. మొన్నటి ఎన్నికల్లో పరిపాలించే అధికారం మీకు ప్రతిపక్షంగా ఉండి ప్రశ్నించే అధికారం మాకు కట్టబెట్టారని అన్నారు. ఈ విషయమై పోలీస్ కంప్లైంట్ ఇస్తే విచారణ ముందుకు సాగదని అధికారంలో ఉన్న మంత్రి తమ అధికారాన్ని ప్రయోగించి ఈ విషయంపై తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


Next Story

Most Viewed