Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

by S Gopi |
Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాలను సాధించాయి. అమెరికా మార్కెట్ల ర్యాలీకి తోడు విదేశీ మదుపర్లు భారత మార్కెట్లలో నిధులను పెట్టడంతో సూచీలు పుంజుకున్నాయి. తాజాగా అమెరికా ఫెడ్ ఛైర్మన్ జెరొమ్ పావెల్ కీలక వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని చెప్పడంతో యూఎస్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో ఉత్సాహం కనిపించింది. ఈ ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్లు అత్యధిక లాభాలకు దూసుకెళ్లగా, నిఫ్టీ 25 వేల మార్కును దాటింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 611.90 పాయింట్లు లాభపడి 81,698 వద్ద, నిఫ్టీ 187.45 పాయింట్లు పెరిగి 25,010 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మెటల్, ఐటీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఫైనాన్స్ రంగాలు ఊపందుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హెచ్‌సీఎల్ టెక్, ఎన్‌టీపీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టైటాన్, ఎంఅండ్ఎం, ఎల్అండ్‌టీ షేర్లు అధిక లాభాలను సాధించాయి. అదానీ పోర్ట్స్, మారుతీ సుజుకి, నెస్లె ఇండియా, కోటక్ బ్యాంక్, సన్‌ఫార్మా స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.89 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed