రికవరీ బాట పట్టిన స్టాక్ మార్కెట్లు

by S Gopi |
రికవరీ బాట పట్టిన స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశ లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో నేలకొరిగిన స్టాక్ మార్కెట్లు బుధవారం కోలుకునే దిశగా ర్యాలీ అయ్యాయి. అంతకుముందు భారీ నష్టాలను మూటగట్టుకున్న సూచీలు తిరిగి పుంజుకునే దిశగా పయనించింది. కేంద్రంలో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించకపోయినా అధికారం కొనసాగించే అవకాశాలే ఉండటంతో మదుపర్లు కొంత ఉపశమనం పొందారు. దీనికి తోడు కీలక బ్యాంకింగ్, రిలయన్స్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లలో కొనుగోళ్లు ఈక్విటీలకు కలిసొచ్చాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్ బుధవారం 2,300 పాయింట్లు, నిఫ్టీ 700 పాయింట్లకు పైగా పెరిగాయి. దేశంలో రాజకీయ స్థిరత్వానికి అవకాశం ఉండటం, ఈ వారంలో జరగనున్న ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశంలో వడ్డీ రేట్ల కోత ఉండొచ్చనే అంచనాల మధ్య మార్కెట్లు రాణించాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 2,303.19 పాయింట్లు ఎగసి 74,382 వద్ద, నిఫ్టీ 735.85 పాయింట్లు లాభపడి 22,620 వద్ద ముగిశాయి. నిఫ్టీలో అన్ని రంగాలు 2-5 శాతం మధ్య పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, ఎంఅండ్ఎం, బజాజ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీల షేర్లు 4 శాతానికి లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.40 వద్ద ఉంది. మదుపర్ల సంపద రూ. ఋస్ 13 లక్షల కోట్లు పెరిగి రూ. 408 లక్షల కోట్లకు చేరింది.

Advertisement

Next Story