MODI: సెమీకండక్టర్ పవర్‌హౌస్‌గా భారత్: మోడీ

by Harish |   ( Updated:2024-09-11 08:44:20.0  )
MODI: సెమీకండక్టర్ పవర్‌హౌస్‌గా భారత్: మోడీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: స్మార్ట్‌ఫోన్‌లు, AI, ఈవీల వరకు అన్నింటిల్లో కూడా సెమీకండక్టర్లకు విపరీతమైన డిమాండ్ పెరిగిన నేపథ్యంలో వీటి ఉత్పత్తికి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చినట్లు భారత ప్రధాని మోడీ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌ గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో మార్ట్‌లో మూడు రోజుల సెమికాన్ ఇండియా 2024 ఈవెంట్‌ ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోని ప్రతి పరికరంలో భారత్ చేత నిర్మించబడిన చిప్‌ ఉండాలనేది మా కల, భారత్‌ను సెమీకండక్టర్ పవర్‌హౌస్‌గా మార్చడానికి అవసరమైన ప్రతిదాన్ని చేస్తామని చెప్పారు. ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమను నడిపించడంలో భారతదేశం ప్రధాన పాత్ర పోషించనుందని మోడీ అన్నారు.

కరోనా సమయంలో భారత్‌తో పాటు ప్రపంచదేశాలు కూడా తీవ్రంగా చిప్‌ల కొరతను ఎదుర్కొన్నాయి. ప్రతి ఎలక్ట్రానిక్ పరికరంలో కీలకమైన భాగంగా ఉండే చిప్‌లు వివిధ రంగాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఇప్పుడు పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నప్పటికి చిప్‌ల కొరత కొంత మేరకు వేధిస్తుంది. భారత్‌కు ఉన్న సానుకూలతల కారణంగా సెమీకండక్టర్ పరిశ్రమలను ఏర్పాటు చేసి వాటి డిమాండ్ తీర్చడానికి అన్ని విధాల కంపెనీలకు సహాయం చేస్తామని మోడీ చెప్పారు.

సెమీకండక్టర్ల తయారీలో ఇప్పటికే రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టామని, అనేక ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయని ఆయన అన్నారు. చిప్‌ల డిజైన్‌‌లో గ్లోబల్ టాలెంట్‌లో భారత వాటా 20 శాతంగా ఉంది. సంస్కరణవాద ప్రభుత్వం, పెరుగుతున్న తయారీ స్థావరం, సాంకేతికత దేశంలో చిప్ తయారీకి 'త్రీ-డి పవర్'ని అందజేస్తుందని ప్రధాని అన్నారు.సెప్టెంబర్ 11 నుండి 13 వరకు జరిగే ఈ ఈవెంట్ "షేపింగ్ ది సెమీకండక్టర్ ఫ్యూచర్" అనే థీమ్‌తో జరుగుతుంది.

Advertisement

Next Story

Most Viewed