ONGC: కృష్ణా గోదావరి బేసిన్‌లో ఐదో బావిని ప్రారంభించిన ONGC

by Harish |
ONGC: కృష్ణా గోదావరి బేసిన్‌లో ఐదో బావిని ప్రారంభించిన ONGC
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్‌జీసీ ముడి చమురు, సహజవాయువు ఉత్పత్తిని పెంపొందించడానికి బంగాళాఖాతంలోని కృష్ణా గోదావరి బేసిన్‌లో ఐదో బావి నుంచి ఉత్పత్తిని ప్రారంభించినట్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. సంస్థ 26 బావులను తవ్వింది. వీటిలో 13 చమురు ఉత్పత్తి, ఏడు గ్యాస్ ఉత్పత్తికి సంబంధించినవి. మార్చి చివరినాటికి మిగిలిన చమురు బావులతో పాటు ఆరు గ్యాస్ బావులను తెరవాలని సంస్థ భావిస్తోంది. బ్లాక్ KG-DWN-98/2 క్లస్టర్-2 ఐదో చమురు బావి నుండి ఉత్పత్తిని ప్రారంభించడం ఒక ముఖ్యమైన మైలురాయి అని సంస్థ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది.

సంస్థ తన ఉత్పత్తిని స్టోరేజ్, ఆఫ్‌లోడింగ్ రవాణా చేయడం మొదలుపెట్టింది. అయితే ఈ కొత్త బావి ద్వారా ఎంత ఉత్పత్తి అవుతుందో పేర్కొనలేదు. ఇప్పటికే అక్కడ ఉన్న 13 బావులలో నాలుగింటిలో గ్యాస్ ఉత్పత్తి జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ తీరానికి 35 కిలోమీటర్ల దూరంలో 300-3,200 మీటర్ల నీటి లోతులో ఉన్న ఈ బ్లాక్‌లను క్లస్టర్-1, 2, 3గా విభజించారు. ప్రస్తుతం క్లస్టర్ 2 నుంచి ముందుగా ఉత్పత్తి చేస్తున్నారు. అసలు ప్రణాళికల ప్రకారం, క్లస్టర్-2 నుండి చమురు ఉత్పత్తి నవంబర్ 2021 నాటికి ప్రారంభం కావాలి, అయితే కొవిడ్ మహమ్మారి కారణంగా ఇది ఆలస్యమైంది. దీనిని పలు విడతలుగా పొడిగిస్తూ, చివరికి జనవరి 7, 2024 నుండి ఉత్పత్తిని ప్రారంభించారు.

Advertisement

Next Story