IPhone: టారిఫ్ అమలు నేపథ్యంలో భారత్ నుంచి పెరిగిన ఐఫోన్ ఎగుమతులు

by S Gopi |
IPhone: టారిఫ్ అమలు నేపథ్యంలో భారత్ నుంచి పెరిగిన ఐఫోన్ ఎగుమతులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఐఫోన్ తయారీ కంపెనీ యాపిల్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ భారాన్ని తప్పించుకునేందుకు పెద్ద ఎత్తున భారత్ నుంచి ఎగుమతులను పెంచింది. తాజా గణాంకాల ప్రకారం, ఈ ఏడాది మార్చిలో కంపెనీ మొత్తం రూ. 20,000 కోట్ల విలువైన ఐఫోన్‌లను భారత్ నుంచి ఎగుమతి చేసింది. ఈ మొత్తం గతేడాది మార్చిలో చేసిన రూ. 11,000 కోట్ల కంటే రెట్టింపు కావడం గమనార్హం. అంతేకాకుందా 2023-24 ఆర్థిక సంవత్సరంలో చేసిన రూ. 85,000 కోట్ల ఎగుమతులను 2024-25లో రూ. 1.50 లక్షల కోట్లకు పెంచిందని ఎకనమిక్ టైమ్స్ పేర్కొంది. ఐఫోన్‌ల తయారీ భారత్, చైనాలలో మాత్రమే జరిగాయి. రెండు దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వరుసగా 26 శాతం, 54 శాతం సుంకాలను విధించారు. ఈ నేపథ్యంలో టారిఫ్ ప్రభావం కారణంగా ఇప్పట్లో ఐఫోన్ ధరలు పెంచే ఆలోచన లేదని యాపిల్ స్పష్టం చేసింది. టారిఫ్ అమలు పరిణామాల మధ్య రవాణా రద్దీ నుంచి తప్పించుకునేందుకు, అమెరికాలోని వేర్‌హౌస్‌లలో తగినంత నిల్వలను కలిగి ఉండటం ద్వారా ధరలను స్థిరంగా ఉంచవచ్చని యాపిల్ భావిస్తోంది. కొత్త టారిఫ్‌ల వల్ల పడబోయే ప్రభావం ఎంతనే దానిపై స్పష్టత వచ్చే వరకు ఐఫోన్ ధరలను పెంచకూడదని కంపెనీ ప్రయత్నిస్తోంది.

మరోవైపు, అమెరికాకు వెళ్లే చైనా, వియతాం ఎగుమతులపై ట్రంప్ అధిక సుంకాలను విధించడంతో ప్రధాన కంపెనీలు గ్లోబల్ తయారీ, ఎగుమతుల విషయంలో అప్రమత్తమయ్యాయి. ఇందులో భాగంగానే యాపిల్‌తో పాటు మరో స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ శాంసంగ్ భారత్‌లో 'మేక్ ఇన్ ఇండియా'కు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నాయి. కస్టమ్స్, నియంత్రణా అవసరాలతో ప్రధానమైన లాజిస్టిక్స్ విషయంలో సంక్లిష్టతలు ఉన్నప్పటికీ, అమెరికా సరఫరాను సజావుగా కొనసాగించేందుకు అవసరమని కంపెనీలు భావిస్తున్నాయి. యాపిల్ ఇప్పటికే అమెరికాకు రవాణా చేసే ఐఫోన్‌ల విషయంలో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించింది. భారత్‌లో తయారయ్యే వాటిని అమెరికాకు మాత్రమే రవాణా చేస్తున్నారు. యూరప్, లాటిన్ అమెరికా, ఇతర ఆసియా మార్కెట్లకు చైనా ఫ్యాక్టరీల నుంచి సరఫరా అవుతున్నాయి. ఒకవిధంగా, తాజా పరిణామాలు భారత్‌లో ఐఫోన్‌ల ఉత్పత్తిని మరింత పెంచుతుంది. దేశీయంగా ఇఫోన్ తయారీ విస్తరణకు అవకాశాలు ఉన్నాయని భారత సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. శాంసంగ్ సైతం వియత్నాంపై ఎక్కువ సుంకాల వల్ల భారత మార్కెట్‌ను ప్రధాన రవాణా కేంద్రంగా చూడాలని భావిస్తోంది. వియత్నాం ప్రభుత్వం అమెరికాతో చర్చలు జరుపుతున్నప్పటికీ, అది తాత్కాలికమే నని, భారత్‌లో మేక్ ఇన్ ఇండియా ద్వారా ఎక్కువ ప్రయోజనాలు లభించవచ్చనే ఆలోచనలో ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.

Next Story

Most Viewed