2025 నాటికి నాలుగో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్

by S Gopi |
2025 నాటికి నాలుగో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్
X

దిశ, బిజినెస్ బ్యూరో: గత కొంతకాలంగా ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థల్లో భారత్ ముందుందని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో 2025 నాటికి భారత్ నాలుగో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా జపాన్‌ను అధిగమిస్తుందని నీతీ ఆయోగ్ మాజీ సీఈఓ అమితబ్ కాంత్ అంచనా వేశారు. భారత జీడీపీ పరిమాణం ప్రస్తుతం యూఎస్, చైనా, జర్మనీ, జపాన్ తర్వాత 5వ స్థానంలో ఉంది. 2022లో యూకేని దాటి భారత్ ఐదవ స్థానంలో నిలిచింది. రికార్డు స్థాయిలో పెరుగుతున్న జీఎస్టీ ఆదాయం, గత మూడు త్రైమాసికాల నుంచి దేశ జీడీపీ వృద్ధి స్థిరంగా కొనసాగడం, 27 దేశాలు భారత కరెన్సీని ట్రేడింగ్ కోసం ఉపయోగిస్తుండటం, ద్రవ్యోల్బణం అదుపులోనే ఉండటం వంటి అంశాలు దేశానికి సానుకూలంగా ఉన్నాయని వివరించారు. స్టీల్, సిమెంట్, ఆటోమొబైల్ తయారీ రంగాలతో పాటు డిజిటల్ మౌలిక సదుపాయాల్లోను భారత్ అగ్రస్థానంలో ఉంది. వీటన్నిటికీ తోడు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఆర్థిక పరపతి విధానం దోహదపడనుంది. ఒక దశాబ్దం క్రితం వరకు భారత జీడీపీ ప్రపంచంలో పదకొండవ అతిపెద్దది. ప్రస్తుత జీడీపీ సుమారు 3.7 ట్రిలియన్ డాలర్లుగా అంచనాలున్నాయి. 2023-24 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో భారత జీడీపీ 8.4 శాతం వృద్ధి చెందింది. దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. ఈ వృద్ధి కొనసాగుతుందని అమితబ్ కాంత్ పేర్కొన్నారు.



Next Story