Forbes List: ట్రిలియన్ డాలర్లు దాటిన భారత టాప్-100 ధనవంతుల సంపద

by S Gopi |
Forbes List: ట్రిలియన్ డాలర్లు  దాటిన భారత టాప్-100 ధనవంతుల సంపద
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది భారత సంపన్నులకు చారిత్రాత్మక మైలురాయిగా నిలవనుంది. ఎందుకంటే దేశంలోని మొదటి 100 మంది ధనవంతుల సంపద తొలిసారిగా 1 ట్రిలియన్ డాలర్ల(మన కరెన్సీలో రూ. 92.35 లక్షల కోట్ల)ను దాటేసింది. ఈ మేరకు ఫోర్బ్స్ తన నివేదికలో పేర్కొంది. తాజాగా భారత్‌లోని సంపన్నుల జాబితాను ఫోర్బ్స్ గురువారం విడుదల చేసింది. గతేడాది టాప్ 100 ధనవంతుల మొత్తం సంపద విలువ రూ. 67 లక్షల కోట్లుగా ఉండేది. అంటే ఏడాది కాలంలో 40 శాతం పెరిగింది. స్టాక్ మార్కెట్లు ఎక్కువ లాభాలతో పుంజుకోవడంతోనే ధనవంతుల సంపద వృద్ధి చెందింది. గతేడాది కాలంలో బీఎస్ఈ 30 శాతం లాభపడింది. దానివల్లే సంపన్నుల్లో 80 శాతం కంటే ఎక్కువ మంది నికర విలువ 1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ లాభపడ్డారు. ఇక, దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 2024 ఏడాదికి అగ్రస్థానం దక్కించుకున్నారు. ఆయన సంపద గడిచిన ఏడాది కాలంలో 27.5 బిలియన్ డాలర్లు(రూ. 2.30 లక్షల కోట్లు) పెరిగి రూ. 10 లక్షల కోట్లు దాటింది. దీంతో ప్రపంచంలోనే 13వ అత్యంత సంపన్న వ్యక్తిగా కూడా ముఖేష్ అంబానీ నిలిచారు. ఆయన తర్వాత టాప్-10లో గౌతమ్ అదానీ రూ. 9.74 లక్షల కోట్లతో రెండో స్థానంలో, సావిత్రి జిందాల్ రూ. 3.67 లక్షల కోట్లు, శివ్ నాడార్ రూ. 3.38 లక్షల కోట్లు, దిలీప్ షాంఘ్వీ రూ. 2.72 లక్షల కొట్లు, రాధాకిషన్ దమానీ రూ. 2.64 లక్షల కోట్లు, సునీల్ మిట్టల్ రూ. 2.57 లక్షల కోట్లు, కుమార్ బిర్లా రూ. 2.08 లక్షల కోట్లు, సైరస్ పూనావాలా రూ. 2.05 లక్షల కోట్లు, బజాజ్ ఫ్యామిలీ రూ. 1.96 లక్షల కోట్లతో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed