AP News:తాగునీటి కోసం మహిళలు ఆందోళన

by Jakkula Mamatha |
AP News:తాగునీటి కోసం మహిళలు ఆందోళన
X

దిశ ప్రతినిధి, అనకాపల్లి:హోంమంత్రి నియోజకవర్గంలో మహిళలు తాగునీటి కోసం రోడ్లెక్కారు. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండల కేంద్రం పరిధిలో తాగునీటి సమస్య పరిష్కరించాలని మహిళలు శుక్రవారం ఆందోళనకు దిగారు. ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గంలోని కోటవురట్ల మేజర్ పంచాయతీలో గత వారం రోజులుగా కొళాయిలు ద్వారా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తాగునీటి పైపు లైన్లు దెబ్బతినటంతో నీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తాయి. దీనిపై గ్రామస్తులు అధికారులతో మొరపెట్టు కున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు.

దీంతో ఆగ్రహం చెందిన మహిళలు..గ్రామ సచివాలయం వద్ద ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. తాగునీటి సరఫరా చేయకపోతే కార్యాలయం ముందు ఖాళీ బిందెలతో ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వారం రోజులుగా తాగడానికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు మొర పెట్టుకుందామని సచివాలయానికి వెళితే, సిబ్బంది అందుబాటులో ఉండటం లేదని మహిళలు వాపోతున్నారు. దీంతో సుదూర ప్రాంతాలకు వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సి వస్తుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి తాగునీటి సరఫరాను పునరుద్దరించాలని లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని మహిళలు హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed