రైతుల కోసం ఏత్యాగానికైనా సిద్ధమే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా: అనగాని సత్యప్రసాద్

by Seetharam |   ( Updated:2023-10-13 08:46:30.0  )
రైతుల కోసం ఏత్యాగానికైనా సిద్ధమే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా: అనగాని సత్యప్రసాద్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఎప్పుడు పచ్చని పంటలతో సస్యశ్యామలంగా ఉండే కృష్ణా డెల్టా ప్రాంతం వైసీపీ పాలనలో ఎడారిని తలపిస్తోంది అని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. వ్యవసాయానికి నీరే ప్రాణాధారం. అలాంటి నీటిని అందించలేని ప్రభుత్వం ఎందుకు? కృష్ణా నదీ జలాల నిర్వహరణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది అని మండిపడ్డారు. సాగునీటి కాలువల నిర్వహణ ప్రభుత్వ వైఫల్యంతో రైతులు బలవుతున్నారు అని ఆరోపించారు. సకాలంలో కాలువల పూడిక, తూటుకాడ తీయకపోవటం కృష్ణా డెల్టాలో కాలువలు, మురికి కాలువల మరమ్మత్తులకు నిధులు కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడంతో చివరి ఆయకట్టుకు నీరందటం లేదు అని ఆరోపించారు. కట్టలు బలహీనమవటంతో విడుదల చేసిన కొద్దిపాటి నీటికే కట్టలు తెగిపోయి రైతులు నష్టపోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. దీంతో వేల ఎకరాల ఆయకట్టు పరిస్ధితి ప్రశ్నార్దంగా మారింది అని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.

రాజీనామా చేసి పోరాటం చేస్తా

ప్రభుత్వ చేతకానితనం వల్ల పంట పొలాలకు నీరు అందక రేపల్లె నియోజకవర్గంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు అని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. నీళ్లు లేక నిజాంపట్నం, రేపల్లె, నగరంపాలెం మండలాల్లో పంటలు ఎండిపోతున్నాయన్నారు. లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పంటలు వేసిన రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. పొట్ట దశలో ఉన్న పంటకు నీరు అత్యంత అవసరమన్న కనీస సృహ కూడా ప్రభుత్వానికి లేకపోవటం సిగ్గుచేటు అని మండిపడ్డారు. కళ్ల ముందే పంట ఎండిపోవటంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారన్నారు. మరోవైపు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర కల్పించలేకపోతోంది అని ఆరోపిస్తూ శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. అన్నదాతల్ని ఆదుకోలేని ప్రభుత్వం ఉంటే ఎంత లేకుంటే ఎంత? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌలు రైతుల పరిస్ధితి అత్యంత దయనీయంగా ఉంది. ప్రభుత్వ చర్యలతో రైతుల నోటికి చేతికి దూరం పెరిగిపోయింది. దేశానికి వెన్నెముకగా ఉన్న రైతు వెన్నెముకను జగన్ ప్రభుత్వం విరగ్గొట్టింది. రైతుల్ని కన్నీరు పెట్టించిన ఏ ప్రభుత్వం బాగుపడలేదు అంటూ శాపనార్థాలు పెట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కృష్టా జలాలు విడుదల చేసి డెల్టా ప్రాంత రైతుల్ని ఆదుకోవాలి అని పత్రికాప్రకటనలో డిమాండ్ చేశారు. రైతులు కోసం ఏ త్యాగానికైనా తాను సిద్దం. అవసరమైతే తన మ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి వెనుకాడను. ఎమ్మెల్యే పదవి నాకు నియోజకవర్గ ప్రజలు పెట్టిన భిక్ష అని చెప్పుకొచ్చారు. వారి కంటే నాకు ఏ పదవి ఎక్కువ కాదు. ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేయాలి. లేకుంటే నాగలిని శిలువగా మోస్తూ రైతుల పక్షాన పోరాటానికి శ్రీకారం చుట్టి తక్షణమే పదవికి రాజీనామా చేస్తా అని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed