విశాఖ డెయిరీలో భారీ స్కాం.. ఐస్ క్రీం పేరుతో లూటీ..!

by srinivas |   ( Updated:2024-10-07 03:00:55.0  )
విశాఖ డెయిరీలో భారీ స్కాం.. ఐస్ క్రీం పేరుతో లూటీ..!
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: వైసీపీ హయాంలో విశాఖ డెయిరీలో భారీ కుంభకోణం జరిగిందని, రైతుల డబ్బులను దోచుకున్నారని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. జగన్ ప్రభుత్వంలో విశాఖ డెయిరీలో భారీ కుంభకోణం జరిగిందని రైతుల డబ్బులను దోచుకున్నారని ఆరోపించారు. గతంలో వందల కోట్ల లాభాల్లో ఉన్న డైరీని ఇప్పుడు నష్టాల్లోకి తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. వైసీపీ నేత, విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుటుంబ సభ్యులు విశాఖ డెయిరీని తమ అడ్డాగా చేసుకుని భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు.

ఆడారిని తప్పించాలి...

వైసీపీ నేత ఆడారి ఆనంద్‌ను విశాఖ డెయిరీ చైర్మన్ పదవి నుంచి తప్పించేలా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలని మూర్తి యాదవ్ కోరారు. ఆడారి కబంధ హస్తాల్లో పాడి రైతులు నలిగిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం విశాఖలోని జనసేన కార్యాలయంలో మూర్తి యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీ అక్రమాలపై సీబీఐ, ఈడీ, ఇన్ కంటాక్స్ విచారణ జరిపించాలని చెప్పారు. ఆడారి ఆనంద్‌కు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా, దేశ విదేశాల్లో భారీగా ఆస్తులు ఉన్నాయని ఆరోపించారు. 20 ఎకరాల ట్రస్టు భూమిని వైసీపీ నేత ఆడారి ఆనంద్ కుటుంబం కొట్టేసిందని అన్నారు. ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయటానికి డైరీ కొనుగోలు చేసిన భూమిని నిబంధనలకు విరుద్ధంగా ఆనంద్ కుటుంబం కొట్టేసిందని ఆరోపించారు.

ఉద్యోగులకు జీతాలివ్వలేని దుస్థితి..

ఐస్ క్రీం పేరుతో డబ్బులు లూటీ చేస్తున్నారని మూర్తి యాదవ్ మండిపడ్డారు. ఆనంద్ నిబంధనలకు విరుద్ధంగా తన కుటుంబ సభ్యుల్లో ఒకరితో ఐస్‌క్రీమ్ యూనిట్, మరొకరి కృషితో ఆసుపత్రిలో మందుల అమ్మకం చేయిస్తున్నారని విమర్శించారు. విశాఖ డెయిరీ సీఈవో అండ్ ఎండీ ఎస్వీ రమణ నెలకు రూ.10 లక్షలకు పైగా జీతం తీసుకుంటున్నారన్నారు. ఆడారి ఆనంద్ కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న విశాఖ డైయిరీలో పలు అక్రమాలు జరిగినట్లు చెప్పారు. విశాఖ డెయిరీలో డైరెక్టర్స్ అందరూ ఆడారి కుటుంబ సభ్యులు, సన్నిహితులేనని ఆరోపించారు. విశాఖ డైయిరీ పాలకవర్గాన్ని రద్దుచేయాలని కోరారు. ఎన్నికల ముందు విశాఖ డెయిరీ డబ్బులు రూ.200 కోట్లను మాజీ సీఎం జగన్‌కి ఇచ్చారని ఆరోపించారు. డైయిరీని కావాలని నష్టాల పాలు చేశారన్నారు.. ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని మూర్తి యాదవ్ అన్నారు.

Advertisement

Next Story