చంద్రబాబుని ప్రజల నుంచి దూరం చేసేందుకు తాడేపల్లి ప్యాలెస్ వేదికగా కుట్ర : నందమూరి బాలకృష్ణ

by Seetharam |
చంద్రబాబుని ప్రజల నుంచి దూరం చేసేందుకు తాడేపల్లి ప్యాలెస్ వేదికగా కుట్ర : నందమూరి బాలకృష్ణ
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్యంతో సీఎం వైఎస్ జగన్ రెడ్డి చెలగాటం ఆడుతున్నాడు అని టీడీపీ ఎమ్మెల్యే, అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. తక్షణమే చంద్రబాబుకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలి అని నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేశారు. అభివృద్ధిలో చంద్రబాబుని ఎదుర్కోలేక అక్రమ కేసులు బనాయించి జైలు పాల్జేసినా కూడా జగన్మోహన్ రెడ్డి పగ చల్లారినట్టు లేదు అంటూ మండిపడ్డారు. చంద్రబాబుని ప్రజల నుంచి దూరం చేసేందుకు తాడేపల్లి ప్యాలెస్ వేదికగా కుట్ర చేస్తున్నాడు అని ఆరోపిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. 73 ఏళ్ల చంద్రబాబు ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాడు.. స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్న చంద్రబాబుకి 34 రోజులుగా జైల్లో కనీస సౌకర్యాలు కల్పించకుండా ఇబ్బందిపెట్టడమే కాకుండా ఆయన్ను అనారోగ్యంపాలు చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి అని ప్రకటనలో బాలకృష్ణ ఆరోపించారు. డాక్టర్ల పేరుతో జైలు సూపరింటెండ్ హెల్త్ రిపోర్ట్ ఇవ్వడం జగన్ రెడ్డి కుటిల రాజకీయం భాగం కాదా? ఒక తెల్లకాగితంపై మీ ఇష్టమొచ్చినట్టు రాసుకుని సంతకం పెట్టే అథారిటీ జైలు అధికారికి ఎవరిచ్చారు అని నిలదీశారు. సొంత పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజును శారీరకంగా హింసించి దొంగ రిపోర్టులు ఇచ్చినట్టే చంద్రబాబు విషయంలో చేస్తున్నారు అని బాలయ్య ఆరోపించారు. చంద్రబాబు మీ జగన్ రెడ్డిలా అవినీతి చేసి జైలు కెళ్లలేదు. జగన్ రెడ్డిలా ముద్దాయికాదు. జైల్లో పెట్టేశాం...మా ఇష్టమొచ్చినట్టు చేస్తామంటే కుదరదు అని హెచ్చరించారు. చంద్రబాబు వ్యక్తిగత సిబ్బందితో వైద్యం చేసేందుకు ఎందుకు నిరాకరిస్తున్నారు? అని ప్రశ్నించారు. చంద్రబాబు నెల రోజుల్లో 5 కేజీల బరువు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. మరో 2 కేజీలు బరువు తగ్గితే ఆ ప్రభావం కిడ్నీలపై పడే అవకాశం ఉంది. విరిగిన ఎముకులు ఎక్స్ రేలో కనిపించకుండా మ్యానేజ్ చేసే ఘనులకు జగన్ రెడ్డి దగ్గర కొదవేలేదు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఆరోగ్యంపై ప్రజల్లో ఎమోషన్స్ రాకుండా ఉండటం కోసం ఎంతకు దిగజారేందుకైనా జగన్ రెడ్డి సిద్ధం అని విమర్శించారు. తక్షణమే చంద్రబాబు వ్యక్తిగత వైద్యులను అనుమతించాలి. ఎయిమ్స్ లాంటి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించి మెరుగైన వైద్యం అందించాలి. చంద్రబాబు గారికి ఏమైనా జరిగితే జగన్ రెడ్డిదే బాధ్యత అని నందమూరి బాలకృష్ణ గట్టిగా హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed