విద్యార్థుల ఫీజు బ‌కాయిలు త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయండి: సీఎం జగన్‌కు లోకేశ్ బహిరంగ లేఖ

by Seetharam |
విద్యార్థుల ఫీజు బ‌కాయిలు త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయండి: సీఎం జగన్‌కు లోకేశ్ బహిరంగ లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల ఫీజు బకాయిలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఫీజు బ‌కాయిలు రూ.1650 కోట్లు త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ సీఎం వైఎస్ జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. విద్యాసంవ‌త్స‌రం మొద‌లై నెలలు గ‌డుస్తున్నా విద్యార్థుల ఫీజు బ‌కాయిలు చెల్లించ‌క‌పోవ‌డంతో వారి భ‌విష్య‌త్తు అగ‌మ్య‌గోచ‌రంగా మారిందన్నారు. డిగ్రీ, పీజీ విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు బకాయిలు రూ.1650 కోట్లు పెండింగ్‌లో ఉంచ‌డంతో కాలేజీల యాజ‌మాన్యాలు విద్యార్థుల‌ని ప‌రీక్ష‌లు రాయ‌నీయ‌డంలేదు అని లేఖలో ఆరోపించారు. చ‌దువు పూర్త‌యిన విద్యార్థుల‌కు మార్కుల‌లిస్టులు, ఇత‌ర స‌ర్టిఫికెట్లు జారీని నిలిపేశాయని ఆరోపించారు. పైచ‌దువులు, ఉద్యోగ ప‌రీక్ష‌లు, ఇంట‌ర్వ్యూల‌కి హాజ‌ర‌య్యే విద్యార్థులు స‌ర్టిఫికెట్లు లేక నానా ఇబ్బందులు ప‌డుతున్నారు అని లేఖలో తెలిపారు. డిగ్రీ మ‌ధ్య‌లో ఉన్న విద్యార్థులు ప‌రీక్ష‌లకి దూరం అవుతున్నారని మండిపడ్డారు. ల‌క్ష‌లాది మంది విద్యార్థుల ఆందోళ‌న‌లు దృష్టిలో ఉంచుకుని త‌క్ష‌ణ‌మే ఫీజులు విడుద‌ల చేయాలి అని డిమాండ్ చేశారు.‘ 2020-21 బ‌కాయి రూ.600 కోట్లను చెల్లించేది లేద‌ని తేల్చేసిన మీ స‌ర్కారు, 2022-23లో నాలుగో టెర్మ్ ఫీజులు రూ.600 కోట్లు చెల్లించాల్సి ఉంది. నాలుగేళ్లుగా పీజీ కోర్సుల బ‌కాయిలు రూ.450 కోట్లు పెండింగ్‌లో ఉంది.టీడీపీ హయాంలో పీజీ కోర్సులకి ఫీజులు చెల్లించగా...మీరు వ‌చ్చాక నిలిపేశారు’ అని లేఖలో నారా లోకేశ్ ఆరోపించారు.

ప్రచారం తప్ప మేలు శూన్యం

జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతిదీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమ‌లు చేస్తున్నామ‌ని ప్ర‌చారం చేసుకుంటున్న వైసీపీ ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్లలో ఒక్క ఏడాదీ సకాలంలో విద్యార్థుల ఫీజురీయింబ‌ర్స్ మెంట్ చేయ‌లేదు అని నారా లోకేశ్ ఆరోపించారు. ఫీజులు చెల్లించాలంటూ కాలేజీల నుంచి తీవ్ర‌మైన ఒత్తిడితో విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు ఆందోళ‌న‌లో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఫీజులు క‌ట్ట‌లేద‌ని కొన్ని కాలేజీలు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌కుండా విద్యార్థులను ఇబ్బందుల‌కి గురిచేస్తున్నాయన్నారు. కేంద్రం ఎస్సీ, ఎస్టీల విద్యార్థుల‌కి ఇస్తున్న 60 శాతం ఫీజు ఏ లెక్క‌లోనా చూప‌కుండా మీరే విద్యాదీవెన ఇస్తున్న‌ట్టు చేస్తున్న‌ ప్ర‌చారం ప్ర‌జ‌ల్ని మోస‌గించ‌డ‌మేనని అభిప్రాయపడ్డారు. కొత్త‌గా విద్యా దీవెన డబ్బులను విద్యార్ధి, వాళ్ల తల్లి జాయింట్ అక్కౌంటులో వేస్తామంటూ మెలిక పెట్ట‌డం విద్యార్థుల్ని మ‌రింత ఇబ్బందులు గురిచేసే ప్ర‌హ‌స‌నంగా అభివర్ణించారు. విద్యాదీవెన‌, వ‌స‌తి దీవెన అంటూ పేర్లు పెట్టి, విప‌రీతంగా ప్ర‌చారం చేసుకోవ‌డం త‌ప్పించి..జ‌రిగిన మేలు శూన్యం అని మండిపడ్డారు. మొండివైఖ‌రి, ప్ర‌చారార్భాటాలు మాని అర్జంటుగా ఫీజు రీయింబ‌ర్స్మెంట్ పాత బ‌కాయిలు, ప్ర‌స్తుత విద్యాసంవ‌త్స‌రం ఫీజులు చెల్లించాలి అని నారా లోకేశ్ సీఎం జగన్‌ని లేఖలో కోరారు.

Advertisement

Next Story

Most Viewed