రాయలసీమకు మహర్దశ పట్టబోతుంది : ఏపీ సీఎం చంద్రబాబు

by M.Rajitha |
రాయలసీమకు మహర్దశ పట్టబోతుంది : ఏపీ సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్ : చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో రాయలసీమను అభివృద్ది చేయబోతున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Nayudu) ప్రకటించారు. మంగళవారం కర్నూలు జిల్లాలోని పుచ్చకాయలమడలో నిర్వహించిన గ్రామసభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. రాయలసీమలో 7.5 లక్షల ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలిపారు. రాయలసీమలో సోలార్, విండ్ పవర్ ఉత్పత్తికి భారీ ఎత్తున కార్యచరణ సిద్దం చేస్తున్నామని, దీని ద్వారా రాయలసీమను దేశంలోనే 'గ్రీన్ ఎనర్జీ హబ్'(Green Hub Energy) గా మార్చబోతున్నట్టు ప్రకటించారు. అన్ని గ్రామాల్లో వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని, దీనిద్వారా స్వంత ఊరిలో ఉండే ఉద్యోగం చేసుకోవచ్చు అన్నారు. కర్నూలు నుండి బళ్లారికి జాతీయ రహదారిని తీసుకు వచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామన్న చంద్రబాబు, కర్నూల్ లో ఏపీ హైకోర్ట్ ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఓర్వకల్లును ఇండస్ట్రీయల్ కారిడార్ మార్చడం ద్వారా వేల కోట్ల విలువైన పరిశ్రమలు రాష్ట్రానికి రాబోతున్నాయని, దాని ద్వారా స్థానికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉద్యోగావకాలు వస్తాయని తెలియ జేశారు. గత వైసీపీ ప్రభుత్వం వెళ్తూ వెళ్తూ ఖజానా ఖాళీ చేసి వెళ్ళిందని, అయినప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలోకి తీసుకువెళ్ళే కార్యచరణలో కూటమి ప్రభుత్వం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story